భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలి

Submitted by admin on Sat, 2010-12-25 20:45

Date: 
December 13, 2010

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వరద బాధిత ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నది.
గత రెండు, మూడు రోజులుగా ఈశాన్య రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావం వల్ల కోస్తా ప్రాతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు దాదాపు 25మంది మరణించినట్లు సమాచారం. చెరువులు, కుంటలు తెగివరదలు సంభవించాయి. లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరికి త్రీవనష్టం వాటిల్లింది. ఉద్యానవన పంటలు, తోటలు దెబ్బతిన్నాయి.
ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్రమైన సర్వే చేసి పంట నష్టపోయిన రైతాంగానికి, కౌలుదార్లకు పరిహారం అందించి ఆదుకోవాలి. మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో చెల్లించాలి. పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం అందించాలి. పంట కొ నుగోళ్ల సమయంలో నాణ్యతా ప్రమాణాలను సడలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. డెల్టా ప్రాంతంలో డ్రైనేజి సౌకర్యాలను మెరుగుపర్చాలి. ముంపు నివారణకు దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. వరద సహాయం కోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి, ప్రజలను ఆదుకునేట్లు ప్రయత్నించాలి.
వాతావరణ శాస్ర్తజ్ఞుల సమాచారం ప్రకారం ముందస్తు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేస్తూ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

(బి.వి.రాఘవులు)
కార్యదర్శి