ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని కోరుతూ అక్టోబర్‌ 4న రాష్ట్రవ్యాపితంగా ఆందోళనలకు సిపిఐ(యం) పిలుపు

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 24 సెప్టెంబరు, 2024.

 

ఉచిత ఇసుక హామీని తక్షణం అమలు చేయాలని కోరుతూ

అక్టోబర్‌ 4న రాష్ట్రవ్యాపితంగా ఆందోళనలకు సిపిఐ(యం) పిలుపు

 

గత ప్రభుత్వ హయాంలో ఇసుక లభించకపోవడం, రేట్లు పెరిగిపోవడం, విచ్చలవిడి అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిరది. అనేక కారణాలతో పాటు ఇసుక సమస్యపై అగ్రహంతో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించారు. ఉచితంగా ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వందరోజుల పాలనలో చూస్తే ఇసుక విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకుండా పోయింది.

అనేకచోట్ల ఇసుక లభించడం లేదు. రవాణా చార్జీలు, ఇతర పేర్లు చెప్పి ఇసుక రేట్లు తగ్గించలేదు. కొన్నిచోట్ల మరింత పెరిగాయి. ఇసుక అక్రమ రవాణా కొనసాగుతున్నది. ప్రజాప్రతినిధులు,అధికార పార్టీ నేతలు పలుచోట్ల ఇసుకపై పెత్తనం చేస్తున్నారు. ముఖ్యమంత్రి పదేపదే బహిరంగంగా హెచ్చరిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు. 

ఇసుక కొరత, అధిక రేట్లు వలన భవన నిర్మాణరంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కొరవడుతున్నది. ఇళ్ల నిర్మాణాలు చేసుకునే చిన్న, మధ్య తరగతి వర్గాలు భారం పడుతున్నది. ఇసుక ఆన్లైన్‌ విధానం ప్రవేశపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటనలకు, హామీలకు, ఆచరణకు పొంతనలేదు. ధరల్లో తీవ్ర వ్యత్యాసం కనబడుతున్నది.

రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా ఇసుక లభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలి. అందరికీ అందుబాటులోకి ఇసుక తీసుకురావాలి .అవినీతిని అరికట్టాలి. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి చూపాలి. నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలి. భవన నిర్మాణాలు చేసుకునే వారిపై  అధిక భారం లేకుండా చూడాలనీ కోరుతూ అక్టోబర్‌ 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు దీక్షలు ప్రదర్శనలు రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రజలకు సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నది.

సెప్టెంబర్‌ 23, 24 తేదీలలో విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశం ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు ఆమోదించింది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి