ప్రజాపంపిణీని దెబ్బతీసే నగదు బదిలీ ప్రతిపాదనను తిప్పికొట్టాలి
నేరుగా నగదు బదిలీ చేసే పథకాన్ని వచ్చే ఏడాది నుండి అమలు చేయాలని కేంద్ర బడ్జెట్ ప్రకటించింది.ఆహారం, ఎరువులు, ఇంధనం సబ్సిడీలలో పెద్దేత్తున 'లీకేజీలు' చోటుచేసుకొటున్నందున ఇది అవసరమని తెలిపింది. పేదలకు బియ్యం,కిరోసిన్, గ్యాస్, గోధుమలు, పంచదార, తదితర నిత్యజీవితావసర సరుకులపై ఇస్తున్న సబ్సిడీలకు కోతపెట్టడానికి, పేదలకు అందించే రాయితీలకు కుదించడానికి ఇది ఒక ముసుగు తప్ప మరేమి కాదు.
లీకేజీలకు ప్రభుత్వం సరైన విధంగా చూడటం లేదు. సార్వత్రిక విధానం స్థానంలో లక్షిత ప్రజాపంపిణీ విధానం ప్రవేశపెట్టిన తర్వాత లీకేజీలు రెట్టింపు అయ్యాయని పదకొండవ పంచవర్ష పత్రాలు తెలిపాయి. లక్సిత పంపిణీ వ్యవస్థ కన్నా ఎక్కువ కవరేజి కలిగిన రాష్ట్రాలలో లీకేజి చాలా తక్కువగా ఉంది. అందుచేత లీకేజీలను నివారించాలంటే సార్వత్రిక విధానానికి తిరిగి వెళ్ళడం, ఆన్లైన్ లాంటి ఆధినిక పద్దతుల్లో అజమాయిషీని పటిష్టంచేయడం ఉత్తమ మార్గం.ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నగదు బదిలీ పథకం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
నగదును దారిద్ర్య రేఖకు దిగివున ఉన్న బిపిఎల్ కుటుంబాలకే పరిమితం చేయడంతో ఎంపికలో పొరపాట్లు, మినహాయింపులు కొనసాగుతాయి. దేశంలోని పేదల్లో మూడింట రెండువంతుల మందికి బిపిఎల్ కార్డులు కాని, అంత్యోదయ కార్డులు కాని లేవని అధికార లెక్కలే చెపుతున్నాయి. బిపిఎల్ జాబితా నుండి మినహాయించబడిన పేదలు నగదు బదిలీ పథకం నుండి కూడ మినహాయించబడతారు.
నగదు బదిలీ పథకం మొదలయిన వెంటనే ఇంధనం, ఎరువులు, ఆహారం ధరలపై నియంత్రణ పూర్తిగా ఎత్తివేయబడుతుంది. మార్కెట్ దయాదాక్షిణ్యాలకు వదిలివేయడం జరుగుతుంది. బహిరంగ మార్కెట్లో ధరలు ఎంత ఆకస్మికంగాను, వేగంగాను పెరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాము. కాని ఆ ధరలకు అనుగుణంగా నగదు బదిలీ పరిమాణం మాత్రం పెరగదు.
ఎరువులు సబ్సిడీని కూడ పేదరిక రేఖకు దిగువున ఉన్న కుటుంబాలకే ఇస్తామంటున్నారు. అప్పుడు సబ్సిడీ అందుకే వారు దాదాపు ఎవ్వరూ ఉండరు. ఎందువల్లనంటే భూమికలిగిన వారిలో అలాంటి వారు దాదాపు ఎవ్వరూ ఉండరు. ఈ పరిస్తితిలో రైతుల్లో ఎరువుల సబ్సిడీని అందుకునే వారిని ఎలా ఎంపింక చేస్తారు?
యుఐడి/ఆధార్ నంబరు పథకాన్ని సబ్సిడీలకు, ఇతర సంక్షేమ పథకాలకు అనుసంధానం చేసేందుకు నగదు బదిలీ పథైకం ప్రయత్నిస్తుంది. యూఐడి కోసం అనుసరిస్తున్న వేలిముద్రలు, కంటిపాపల ఫొటోల ఆధారంగా పనిచేసే బయోమెట్రిక్ విధానం మంచి చెడ్డలు ఇంకా రుజువు కాలేదు, దానికి ఎంత ఖర్చవుతుందో కూడ తెలియదు. యుఐడి సమాచారాన్ని తయారు చేయడం, నిర్వహించడానికి అయ్యే ఖర్చు ప్రస్తుత సబ్సిడీ మొత్తం కన్నా చాల ఎక్కువ ఉంటుందనడంలో సందేహం లేదు.
నేరుగా బదిలీ చేసిన నగదును దాన్ని ఉద్దేశించిన సరుకునే కొనుగోలు చేయడానికి వినియోగిస్తారన్న గ్యారంటీ లేదు. పురుషాధిక్యం కొనసాగుతున్న ఈ సమాజంలో ఆ మొత్తం కుటుంబ పెద్దగా ఉన్న పురుషుని ఇష్టా ఇష్టాల ప్రకారం ఖర్చు పెట్టుకొనే అవకాశమే హెచ్చు.
నగదు బదిలీపై ప్రభుత్వానికి అంతగా మోజు ఉంటే ప్రస్తుత సబ్సిడీలకు అదనంగా దాన్ని ప్రవేశపెట్టాలి. కాని సబ్సిడీలను ఎత్తివేసి వాటి స్థానంలో ప్రవేశపెడితే మాత్రం తీవ్రంగా వ్యతిరేకించి తిప్పికొట్టాలని సిపిఐ(ఎం) ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది.
అభివందనాలతో....
భారత కమ్యూనిస్టుపార్టీ(మార్క్సిస్టు)
ఆంధ్రప్రదేశ్ కమిటీ, హైదరాబాదు