
నరేంద్ర మోడీ అనుసరిస్తున్న పాకిస్తాన్ విధానంపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. పాక్ విధానం గొర్రె కసాయివాడిని నమ్మిన తీరులో ఉందని దుయ్యబట్టారు. అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మన్మోహన్ మాట్లాడుతూ మోడీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం కొలువుతీరాక ఉగ్రవాదులు కాశ్మీర్లోనే కాకుండా పంజాబ్ సహా ఇతర పొరుగు రాష్ట్రాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. గత రెండేండ్లుగా వ్యవసాయ రంగం కుదేలై రైతులకు కష్టాలు మిగిల్చిందని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తిరిగి దేశానికి రప్పిస్తానని ఎన్నికలకు ముందు మోడీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.