త్రిపురలో ఇంటి పనివారికి పెన్షన్‌

ప్రజల జీవనప్రమాణాలు మెరుగుపర్చేందుకు త్రిపురలోని లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం కొత్తగా మూడు పింఛను పథకాలను ప్రవేశపెట్టింది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ తెలిపారు. అరకొర వేతనాలకు ఇళ్లల్లో పనిచేసే మహిళా ఇంటి పనివారలకు నెలనెలా రూ.350 చొప్పున పెన్షన్‌ చెల్లించాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అలాగే హిజ్రాలకు, ఎయిడ్స్‌, కుష్టు బాధితులకు నెలకు రూ.500 చొప్పున భత్యం చెల్లించాలని కూడా కేబినెట్‌ నిర్ణయించినట్లు మాణిక్‌ వెల్లడించారు. 
అంగన్‌వాడీలకు అండగా.. 
అంగన్‌వాడీ కార్యకర్తలకు, సహాయకులకు కూడా త్రిపుర ప్రభుత్వం కొత్త పింఛను పథకాన్ని ప్రకటించింది. ఉద్యోగ విరమణ అనంతరం అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.500, సహాయకులకు నెలకు రూ.350 చొప్పున పింఛను చెల్లించనున్నట్లు మాణిక్‌ సర్కార్‌ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తూ కార్యకర్తలు కానీ, సహాయకులు కానీ చనిపోతే వారి కుటుంబాలు వీధిన పడకుండా చూసేందుకు వీలుగా తక్షణ సాయంగా కార్యకర్తలైతే రూ.50 వేలు, సహాయకులైతే రూ.30 వేలు చొప్పున వారి కుటుంబాలకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్రిపుర ప్రభుత్వం ప్రస్తుతం 20 రకాల పింఛను పథకాలను అమల్జేస్తోంది. దాదాపు 1,07,060 లబ్దిదారులకు నెలనెలా పింఛను అందుతోంది. సమాజంలో తీవ్ర అణచివేతకు గురయ్యే ప్రజానీకానికి సామాజిక భద్రత కల్పించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని మాణిక్‌ సర్కార్‌ చెప్పారు. మహిళా, శిశు సంక్షేమానికి, వృద్ధులకు, వికలాంగులకు చేయూతనందించేందుకు తమ ప్రభుత్వం ప్రాముఖ్యతనిస్తోందని ఆయన తెలిపారు.