
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
ముఖ్యమంత్రికి నిన్న వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం,
ఆఫీసు కార్యదర్శి)
విజయవాడ,
తేది : 02 అక్టోబర్, 2024.
శ్రీయుత నారా చంద్రబాబునాయుడు గారికి,
గౌరవ ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: విద్యుత్ ఇంధన సర్దుబాటు చార్జీల ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం
ఉపసంహరించుకోవాలని మరియు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్మీటర్లు తొలగించాలని
కోరుతూ..
అయ్యా,
గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో వివిధ రూపాలలో మోపిన విద్యుత్తు, ఇతర
భారాలను తగ్గిస్తామని, చార్జీలు పెంచబోమని 2024 ఎన్నికల్లో హామీ ఇచ్చి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఆ హామీకి భిన్నంగా విద్యుత్
ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్పిపిసిఎ) 2022- 23 సంవత్సరానికి సుమారు 8114
కోట్ల రూపాయల భారం వేస్తూ మూడు విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదనలతో
విద్యుత్ నియంత్రణ మండలి (ఇఆర్సి) నోటిఫికేషన్ జారీ చేసింది. 2023 -24
సంవత్సరానికి సంబంధించి మరో 11 వేల కోట్ల రూపాయలకు పైగా సర్దుబాటు చార్జీల
భారం మోపబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మొత్తం దాదాపు 20 వేల కోట్ల
రూపాయల భారం విద్యుత్ వినియోగదారులు, రాష్ట్ర ప్రజలపై భారం పడబోతున్నది.
ప్రైవేటు విద్యుత్ కంపెనీల దోపిడి, అధిక రేట్లకు పవర్ ఎక్స్చేంజిలో
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు, వివిధ స్థాయిల్లో అవినీతి, అపసవ్య విధానాల
వలన విద్యుత్ వ్యయం పెరుగుతున్నది. ఆ భారాన్ని సర్దుబాటు చార్జీల రూపంలో
జనం నెత్తిన వేయటం అసమంజసం. ఇప్పటికే వివిధ రకాల పేర్లతో విద్యుత్
చార్జీలు అధిక భారంగా ప్రజల భావిస్తున్నారు. వారికి ఉపశమనం కలిగించాల్సింది
పోయి, ఇలాంటి అదనపు భారాలు మోపటం సరికాదు.
కావున తక్షణమే ఈ నోటిఫికేషన్ను ఉపసంహరించాలని కోరుతున్నాను. ఏనాడో
వాడుకున్న విద్యుత్తుకు ఆ తర్వాత కాలంలో అదనంగా వేసే సర్దుబాటు చార్జీల
విధానాన్ని పూర్తిగా రద్దు చేయవలసిన అవసరం ఉంది. కావున సర్దుబాటు చార్జీలను
కూడా రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ప్రతిపాదిత ఇంధన సర్దుబాటు అంశం ప్రస్తుత ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం
లేదని డిస్కాములు మంగళవారం నాడు వివరణ ఇచ్చాయి. కనుక పాత ప్రభుత్వ హయాంలోని
అదనపు భారం విధించడానికి కూడా ఈ ప్రభుత్వం పూనుకోకూడదు. ఈ రీత్యా చూసినా
ఎఫ్పిపిసిఎ ప్రతిపాదనలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను. గత
ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు అక్రమంగా బిగించిన స్మార్ట్మీటర్లు
తొలగిస్తామని మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఆ మేరకు వాటిని తొలగించాలని
కోరుతున్నాను.
విద్యుత్ చార్జీలు పెంచబోమని, స్మార్ట్మీటర్లు తొలగిస్తామని మీరు
ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--
COMMUNIST PARTY OF INDIA (MARXIST)
Andhra Pradesh Committee
H.No. 27-30-9,Akula vari Street,
Governorpet, Vijayawada - 520 002.
Phone: 0866-2577202;
Web: www.cpimap.org