(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మంత్రిగారికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 05 నవంబర్, 2024.
శ్రీయుత నారా లోకేష్ గారికి,
రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖా మంత్రివర్యులు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: విద్యా శాఖ - మెగా డిఎస్సీతోపాటు ఆదివాసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత చేసి ప్రత్యేక డిఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ...
అయ్యా!
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 16347 టీచర్ పోస్టులు భర్తీకి నవంబర్ 6 జారీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్త్తోంది. షెడ్యూల్డ్ ఏరియాలో నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పించే జి.వో.3ని 2020లో సుప్రీంకోర్టు రద్దు చేస్తే, గత ప్రభుత్వం పునరుద్ధరణ చేయకుండానే జనరల్ డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఆదివాసులు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ద్వారా ఏజెన్సీలో గిరిజన సంక్షేమ, ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో టీచర్స్ పోస్టు ఖాళీల భర్తీకి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తే ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. కావున మెగా డిఎస్సీతోపాటు ఆదివాసీలకు రిజర్వేషన్ చట్టబద్దత చేసి ప్రత్యేక డిఎస్సీ ద్వారా ఏజెన్సీలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నాను.
గురుకులం (బైలా) నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్ డిఎస్సీలో గురుకులం పోస్టులను కూడ విలీనం చేసింది. గిరిజన గురుకులానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని కూడా లెక్కచేయకుండా ఏకపక్షంగా ప్రభుత్వం పిజిటి 58 పోస్టులు, టిజిటి 446 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయడం దారుణం. గిరిజన గురుకులంలో జోనల్ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. కాని జనరల్ డిఎస్సీలో మాత్రం జిల్లా యూనిట్గా నోటిఫికేషన్ జారీచేసియున్నారు. గత 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్న టీచర్లను రెగ్యులర్ చేయకుండా జనరల్ డిఎస్సీ ద్వారా స్కూల్ ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులైన ఆదివాసీలను గెంటి వేయొద్దని కోరుతున్నాను.
ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు ఉద్యోగ రిజర్వేషన్కు గత రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూల్డ్ క్లాజ్ (2) ప్రకారం చట్టబద్ధత కల్పిస్తామని ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్(టిఏసి) చేసిన తీర్మానాన్ని నేటి ప్రభుత్వం అమలు చేయాలి. ఇప్పటికే ఆదివాసీ నిరుద్యోగులు తీవ్రమైన అభద్రత భావం, ఆందోళనతో ఉన్నారు. నేటికీ పునరుద్ధరణకు కనీసం ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.
రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ ఏరియాలో ఆదివాసులకు భద్రత, రక్షణ, పరిపాలన బాధ్యత గూర్చి స్పష్టంగా పేర్కొనబడినది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసే ఏ ఉత్తర్వులైనా 5వ షెడ్యూల్ క్లాజ్ (1)(2) ప్రకారం గవర్నర్, టి.ఏ.సి అనుమతి తప్పకుండా తీసుకోవాలి.
ఆదివాసులకు ప్రత్యేక భాష, సంస్కృతి ఉన్నాయి. గిరిజన భాష రాని ఉపాధ్యాయులను ఏజెన్సీలో నియమించడం వల్ల ఆర్టికల్ 29, 32 ఉల్లంఘించినట్లు అవుతుంది.
కె.జి.బి.వి, ఏకలవ్య మోడల్ స్కూల్స్తో పాటు గత ప్రభుత్వాల కాలంలో 1998, 2008లలో సుమారు 400 మరియు 2000 డీఎస్సీ ద్వారా 280 ఎస్.జి.టీ పోస్టులను పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మినిమం టైమ్స్ స్కేల్ ప్రాతిపదికన స్థానికేతరులతో గత ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనే ఆశ, నమ్మకం కోల్పోయి తీవ్ర ఆవేదనతో ఉన్నారు.
అధికారంలోకి వచ్చాక ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగ, ఉపాధ్యాయ రిజర్వేషన్ కల్పిస్తామని నాడు అరకు ఎన్నికల సభలో నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం మీకు విదితమే. కావున ప్రభుత్వం వెంటనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్తో పాటు ఆదివాసీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్స్ పోస్టుల భర్తీకి పున:పరిశీలించి, ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, భద్రతా, భరోసా కల్పించే చర్యలు తీసుకోవాలని, 2024 నవంబర్ 11 న ప్రభుత్వం నిర్వహించే అసెంబ్లీ సమావేశంలోనే ఏజెన్సీ ప్రాంత స్థానిక ఆదివాసులకు నూరు శాతం రిజర్వేషన్ చట్టబద్ధత కల్పించే షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ, ఉపాధ్యాయ నియామక చట్టం చేయాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
కాపీటు :
శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు,
గిరిజన శాఖా మంత్రివర్యులు,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి