
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 11 నవంబర్, 2024.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఎన్నికల హామీలను ఎప్పటినుండి అమలు చేస్తారో బడ్జెట్లో కనీస ప్రస్తావన చేయకపోవడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఆత్మస్తుతి, పర నిందతో నిండిపోయింది. రాష్ట్ర ప్రజలకు నిర్దిష్టంగా కలిగే ప్రయోజనాల గురించి ప్రస్తావనే లేదు.
బడ్జెట్ పూర్తి రాజకీయ పత్రంగా ఉంది. అనేక పేరాల్లో ముఖ్యమంత్రిని కీర్తించడం, అలాగే గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని వర్ణించడానికే సరిపోయింది. ఆదివాసులు, దళితులకు, మహిళలు, మైనార్టీల సంక్షేమానికి నామమాత్రంగా నిధులు కేటాయించడం అన్యాయం. సబ్ప్లాన్గా దళితులకు కేవలం 6.28 శాతం, గిరిజనులకు 2.56 శాతం మాత్రమే కేటాయించారు. మహిళా శిశు సంక్షేమ కేటాయింపులు ఇంకా దిగనాసిగా రూ. 4,285 కోట్లు మాత్రమే! ఇదీ సమాజంలో సగంగా ఉన్న స్రీలకు ప్రాధాన్యత! మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాల ప్రస్తావన లేదు. ఇక వివిధ పథకాలు వల్లె వెసిన మంత్రి వాటిని బాల బాలికలకు బాలింతలకు సేవలందిస్తున్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు పెండిరగ్లోవున్న వేతన పెంపు హామీల గురించి మాత్రం ప్రస్తావించలేదు. సంక్షేమ పింఛన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం గురించి ఘనంగా చెప్పిన ఆర్థిక మంత్రి మహిళకు ఉచిత బస్ ప్రయాణం త్వరలో ప్రారంభిస్తామని చెప్పారేతప్ప సుపర్ 6లో భాగమైన అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటివి ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకపోవడం ఆయా తరగతులకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. పంటల బీమా స్వచ్ఛంద నమోదు అన్న ఆకర్షణీయ మాటల వెనుక ఇప్పటివరకున్న ఉచిత బీమా ఇకపై రైతు ప్రీమియం చెల్లిస్తేనే అమలవుతుందన్న విషయాన్ని దాచిపెట్టడం అన్నదాతను మభ్యపుచ్చడమే! అలాగే మత్స్యకారుల గురించి చాలా చెప్పినా ఇప్పటివరకూ చెల్లించని వేట నిషేధ భృతి గురించి ప్రస్తావించకపోవడం వారిని గందరగోళానికి గురి చేస్తోంది. మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ను ప్రస్తావించారుకానీ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్సి గురించి, జివో నెం 3 పునరుద్దరణ గురించి పేర్కొనకపోవడం అన్యాయం.
పట్ణణాభివృద్ధికి 11,490 కోట్లు ప్రస్తావించారు. అయితే, ఇటీవల కాలంలో తరచు సంభవిస్తున్న తాగునీరు కలుషితం కావడం, అకస్మిక భారీ వర్షాలు కారణంగా నీటమునగడం వంటి సంఘటనలను ప్రస్తావించడం కానీ, పరిష్కార మార్గాలకు చర్యలను గానీ ప్రస్తావించలేదు. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. కానీ, నిర్వాసితుల గురించి మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. ఎప్పటిలోగా ప్రాజెక్టును పూర్తి చేస్తారన్నదీ స్పష్టంగా చెప్పలేదు. పరిశ్రమలకు, పెట్టుబడులకు గమ్యంగా రాష్ట్రాన్ని మారుస్తామన్నారు కానీ సంపద సృష్టించే కార్మికుల సంక్షేమం ఊసు లేదు.
అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన కూటమి బడ్జెట్లో చార్జీల తగ్గింపు గురించి ప్రస్తావనే చేయకపోవడం విడ్డూరం. అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్ల నిధులను కేంద్రం నుండి పొందామని చెప్పి ప్రపంచబ్యాంకు దగ్గర అప్పు అన్న విషయాన్ని దాచి పెట్టింది. మొత్తంమీద బడ్జెట్ ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని విస్మరించింది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి