1/70పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి - సిపిఎం డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 29 జనవరి, 2025.

 

1/70పై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి

సిపిఎం డిమాండ్‌

ఏజెన్సీలో అభివృద్ధి జరగాలంటే 1/70 చట్టాన్ని సవరించాలని శాసనసభ స్పీకర్‌ గౌ॥ అయ్యన్నపాత్రుడు గారు ప్రకటించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ ఆదివాసీ భూములకు రక్షణ కల్పించే ఈ చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేయాలి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేస్తున్నది. 27వ తేదీన విశాఖపట్నంలో జరిగిన జాతీయ టూరిజం ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ సందర్భంగా జరిగిన సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆదివాసీల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతం రాజ్యాంగం 5వ షెడ్యూలు కిందకు వస్తుంది. దీన్ని ధిక్కరించే అధికారం ప్రభుత్వానికి కూడా లేదు. ఇప్పటికే టూరిజం అభివృద్ధి పేరుతో పలు ఉల్లంఘనలు జరుగుతున్నాయి. వీటిని వెంటనే అరికట్టాలి. బినామీల పేరుతో గిరిజన భూముల్లో లాడ్జీలు పెట్టి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు. ఇప్పుడు 1/70ని సవరిస్తే గిరిజనులకు భూమి దక్కకుండా పోతుంది.

ఏజెన్సీలో లభించే సహజ వనరులను బడా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుండో పలు పథకాలు వేస్తున్నది. అయ్యన్నపాత్రుడు గారి వ్యాఖ్యలు దీన్ని మరింత బలపరుస్తున్నాయి. 1/70 చట్టం 1970లలో పెద్ద ఎత్తున జరిగిన ఆదివాసీ పోరాటాల ద్వారా సాధించుకున్నారు. ఈ చట్టం మూలంగానే గిరిజనులకు ఎంతోకొంత భూమిపై అధికారం వచ్చింది. 

2006`07లో కేంద్రంలో ఉన్న యుపిఏ ప్రభుత్వంపై వామపక్ష పార్టీలు ఒత్తిడి తెచ్చి అటవీ సంరక్షణ చట్టాన్ని తీసుకువచ్చాయి. భూమిపై గిరిజనుల హక్కులను ఈ చట్టం మరింత బలోపేతం చేసింది. కానీ మోడీ ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించి గిరిజనుల నుండి భూముల్ని బలవంతంగా లాక్కోడానికి ప్రయత్నిస్తున్నది. పంప్డ్‌ స్టోరేజీ హైడల్‌ ప్రాజెక్టుల పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలను ఈ ప్రాంతంలో అదానీపరం చేస్తున్నారు. ఆదివాసీ ప్రజలు దీనిని ప్రతిఘటిస్తున్నారు. ఇప్పటికే గిరిజన సలహా మండలి, పెసా చట్టం, జి.వో.నెం.3 వగైరా రక్షణలన్నీ ఒక్కొక్కటి ఎగిరిపోతున్నాయి. గిరిజన యువతలో అసంతృప్తి పెరుగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వీటినేటినీ పట్టించుకోకుండా కార్పొరేట్‌ సేవలో మునిగిపోతున్నాయి. ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గిరిజన ప్రాంతాలు 1/70ని సవరిస్తే మరింత వెనకబడిపోతాయి. తక్షణం ఇలాంటి ఆలోచనలను విరమించుకోవాలని, 1/70 చట్టాన్ని పకడ్భంధీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి