రొయ్య 100 కౌంట్‌ కిలో రూ.270కి కొనాలి. - సిపిఐ(యం) డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 16 ఏప్రిల్‌, 2025.

రొయ్య 100 కౌంట్‌ కిలో రూ.270కి కొనాలి. - సిపిఐ(యం) డిమాండ్‌

రొయ్యల ధరలను నిర్ణయించేందుకు నిన్న విజయవాడలో ట్రేడర్స్‌, రైతు ప్రతినిధులతో చర్చలు జరిపి నిర్ణయించిన రేట్లు రైతుల ఆకాంక్షకు అనుగుణంగా, ఏ మాత్రం న్యాయంగా లేవని సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. 100 కౌంటు ఉత్పత్తికి రూ.250లు పైగా ఖర్చు అవుతోందని రైతులు తెలిపారని ధర రూ.230లుగా నిర్ణయించడం రైతులను నష్ట పెట్టడం తప్ప ఆదుకోవడం కాదని అన్నారు. 100 కౌంటు ధర రూ.270లు ఉండాలని, ప్రతి కౌంటుకు ప్రస్తుతం నిర్ణయించిన ధరలకు ప్రభుత్వం కూడా కొంత మొత్తం అదనంగా కలిపి సబ్సిడీ ఇవ్వాలని శ్రీనివాసరావు కోరారు. ట్రంప్‌ ఆంక్షలకు ముందు రూ.260లు ఉంది. ఆంక్షల తరువాత రూ.200లోపు పడిపోయి ప్రస్తుతం తిరిగి రూ.225కి చేరింది. అంటే ట్రేడర్లు అంగీకరించింది రూ.5లు పెంపుదల మాత్రమే. ఇది ఏమాత్రం గిట్టుబాటు కాదు. సమావేశంలో రైతుల కష్టాలు, నష్టాల కంటే ట్రేడర్లకు ఇబ్బందులున్నాయంటూ ఎక్కువగా చర్చలు జరిగినట్లుందన్నారు. ట్రేడర్లకు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వాలు పరిశీలించి పరిష్కరించాలి. కానీ రైతుల కష్టాన్ని, పంటకు ధర కల్పించడమనే అంశాన్ని తక్కువ చేసి చూడటం, రైతులను సర్దుకోవాలనడం సరికాదన్నారు. చంద్రబాబు గారు రోజూ చెప్తున్న పి4 ప్రకారం పైనున్న ఎగుమతి దార్లు, బ్రోకర్లు కిందనున్న ఆక్వా రైతులకు న్యాయమైన ధర ఇచ్చి ఆదుకోవాలని, అందుకు ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకోవాలని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఫీడ్‌ ధరల నియంత్రణ, న్యాయమైన సీడ్‌, ఫీడ్‌, శీతల గిడ్డంగుల వసతి, కరెంటు రాయితీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనివి. కావున వాటిపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని, రైతులను ఆదుకోవాలని కోరారు. ధరల స్థిరీకరణ నిధి, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ద్వారా రొయ్యల రైతులను తక్షణం ఆదుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కష్టంతో వేల కోట్లు ఆదాయాన్ని పొందడమే కాకుండా రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులకు తగు న్యాయం జరగకపోతే రైతులు కార్యాచరణ రూపొందించుకోవాలని కోరారు. ప్రభుత్వం అన్ని రైతు సంఘాలతో చర్చలు జరపాలని కోరారు.

 

(జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి