
(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఉప ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. ` జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
విజయవాడ,
తేది : 12 మే, 2025.
శ్రీయుత కొణిదెల పవన్కళ్యాణ్ గారికి,
గౌరవ ఉప ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,
అమరావతి.
విషయం : తిరుపతి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజలను, పంటలను ఏనుగుల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ...
అయ్యా!
తిరుపతి రేణిగుంట మండలంలో, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో కామరాడ, సీతంపేట, భామిని, సీతానగరం మండలాల్లో ఏనుగుల వలన పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతున్నది. ఆ ప్రాంతంలో ఏనుగుల దాడిలో ఇప్పటికే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఏనుగులు ఎప్పటికప్పుడు దాడి చేస్తూనే ఉన్నాయి. ఇటీవల తిరుపతి జిల్లా రేణిగుంట మండలం మమందురు గ్రామంలో మార్కాండ గురవయ్య అనే అతని మామిడితోటలో 1.50 ఎకరాలలో పంట చేతికి వచ్చే మామిడిచెట్లు, ఫెన్సింగ్ పూర్తిగా ఏనుగులు నాశనం చేశాయి. ఇలా ఆ గ్రామంలో రైతులు ఎప్పటికప్పుడు ఏనుగుల దాడి వలన తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం ఇవ్వాలని కోరుతున్నాను. అలాగే ఆ ప్రాంత రైతుల పంటలను కాపాడేందుకు పూడిక పోయిన కాలువను పూడిక తీయించి వినియోగంలోకి తీసుకురావాలి. సోలార్ ట్రంచింగ్ ఏర్పాటు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలు ఏనుగులను తరలించాలని గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. నేటికీ శాశ్వత పరిష్కారం లభించలేదు. పైగా గ్రామాల మధ్యలో ప్రభుత్వం ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదన ఉంది. దానికి వ్యతిరేకంగా ఆ గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ ఎలిఫెంట్ జోన్ ఏర్పాటు వలన ఆయా గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే ఎలిఫెంట్జోన్ను జనం లేని సుదూర ప్రాంతానికి తరలించాలని కోరుతున్నాను.
కావున పై ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని, గ్రామాల మధ్య ఎలిఫెంట్ జోన్ ప్రతిపాదన విరమించుకోవాలని కోరుతున్నాను. అలాగే చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నాను.
అభివందనములతో...
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి