
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 13 జూన్, 2025.
నిబంధనల పేరుతో ‘‘తల్లికి వందనం’’ కోతలు వద్దు
- సిపిఐ(యం) డిమాండ్
తెలుగుదేశం కూటమి ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లుగా ‘తల్లికి వందనం’ నగదును అర్హులైన విద్యార్థులందరికీ నిబంధనలు సడలించి తల్లుల ఖాతాల్లో జమ చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. అడ్డగోలు నిబంధనలతో దాదాపు 9 లక్షల కుటుంబాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఆదాయ పరిమితిని సడలించి గ్రామాల్లో 2.5 లక్షలు, పట్టణాల్లో 3 లక్షల లోపు ఆదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ తల్లికి వందనం వర్తింపజేయాలని, ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారందరికీ వేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. ఈ విద్యా సంవత్సరం ఒకటో తరగతి, ఇంటర్లో అడ్మిషన్లు అయిన వెంటనే వారికి కూడా నగదు చెల్లించాలని కోరుతున్నాము. స్కీం వర్కర్స్, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఈ పథకాన్ని వర్తింపచేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
గత ప్రభుత్వం విధించిన షరతులను నాడు విమర్శించిన కూటమి నేతలు నేడు అంతకుమించిన షరతులు పెట్టి లబ్దిదారులతోపాటు నగదును కూడా తగ్గించడం సరికాదు. రూ.15,000 వేలు నేరుగా తల్లులకు చెల్లిస్తామని, ఇప్పుడు రూ.2,000 మినహాయించారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా ఇస్తామని చెప్పి, ఫీజు రీఎంబర్స్మెంట్ పొందుతున్న కుటుంబంలోని విద్యార్థులకు ఈ పథకం అమలు కాకుండా మినహాయించడం హామీ ఉల్లంఘనే. ఇంత వరకు ఫీజురియంబర్స్మెంట్ ఎవరికీ ఇవ్వకుండానే ఆ పేరుతో తల్లికి వందనంపై కోత విధించడం అన్యాయం. విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న వారి తల్లులకు కాకుండా నేరుగా స్కూళ్ల మేనేజ్మెంట్ల ఖాతాలకు చెల్లించడం ప్రభుత్వ విద్యను దెబ్బతీయడమే. గ్రామ వార్డు సచివాలయాలలో వచ్చే ఫిర్యాదులను సత్వరం పరిష్కరించి అర్హులందరికీ ఈ పథకం అమలు చేయాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి