
ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సమావేశం నిన్న, ఈరోజు (16,17 జూన్) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.వి.నాగేశ్వరరావు అధ్యక్షతన విజయవాడలో జరుగుతుంది. రాష్ట్ర కమిటీ ఆమోదించిన ప్రకటనను ప్రచురణార్థం విడుదల చేస్తున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 17 జూన్, 2025.
కుప్పంలో మహిళను కట్టేసిన నిందితులపై కఠిన చర్య తీసుకోవాలి
చేసిన అప్పు భర్త తీర్చలేదని భార్యను తాడుతో చెట్టుకు కట్టేసి దాడిచేసిన దారుణ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని, నిందితులపై చర్య తీసుకోవాలని, బాధితుల అప్పు మాఫీ చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్న ఈ అనాగరికచర్య చిత్తూరు జిల్లా కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప ఇదే గ్రామానికి చెందిన మునికృష్ణప్ప దగ్గర తీసుకున్న అప్పును చెల్లించమని ఆయన భార్యను చెట్టుకు కట్టేశాడు. చిన్న పిల్లాడు ఏడుస్తున్నప్పటికీ కనికరించకుండా అమానుషంగా ప్రవర్తించిన సంఘటనపై ప్రభుత్వం స్పందించి మునికృష్ణప్పపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నది. ముఖ్యమంత్రి సొంత నియోజకర్గంలో ఈ సంఘటన జరగడం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అనాగరిక దాడులకు నిదర్శనం. ఇలాంటి ఫ్యూడల్ అణచివేత ఈ ఆధునిక కాలంలో కూడా కొనసాగడం ప్రభుత్వానికి సిగ్గుచేటు.
రాష్ట్రంలో మైక్రో ఫైనాన్స్ అప్పులు పెరుగుతున్నాయని అనేక వార్తలొస్తున్నాయి. ఇటీవల బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెలటూరు గ్రామంలో పార్వతీబాయ్ ఆత్మహత్య చేసుకుంది. ఫైనాన్స్ కంపెనీలు బలవంతాన వసూళ్ళు చేసుకోవడంకోసం అవమానాలకు గురిచేస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. ఈ వేధింపులకు తాళలేక కొందరు గ్రామాలను వదిలిపెట్టడం, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కావున ప్రభుత్వం స్పందించి మైక్రో ఫైనాన్స్ మరియు వడ్డీ వ్యాపారుల ఆగడాలను అరికట్టడానికి రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి