ప్రభుత్వరంగంలోనే విశాఖస్టీల్‌ ప్లాంటు ఉండాలి దీనిపై చంద్రబాబు, పవన్‌ ప్రధానితో ప్రకటన చేయించాలి

(ఈరోజు (20 జూన్‌, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. 

ఆ వివరాలను ప్రచురణార్థం/ ప్రసారర్థం పంపుతున్నాము. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

ప్రభుత్వరంగంలోనే విశాఖస్టీల్‌ ప్లాంటు ఉండాలి 

దీనిపై చంద్రబాబు, పవన్‌ ప్రధానితో ప్రకటన చేయించాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ 

విధానాలు మార్చుకోకుండా

యోగ పేరుతో ప్రజలను మోసగించొద్దు

తిండి, గూడు, ఉపాధి భద్రతతో మానసిక ప్రశాంతత

గిరిజన ప్రాంత నిరుద్యోగులకు మోసం

పాఠశాలల కుదింపుతో విద్యావ్యవస్థ కుదేలు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ రాష్ట్రానికి వస్తున్న ప్రధాని మోడీతో మాట్లాడి విశాఖ స్టీలు ప్లాంటు ప్రభుత్వరంగంలో కొనసాగించేలా ప్రకటన చేయించాలని, యోగా పేరుతో రాష్ట్ర ప్రజలను మోసగించొద్దని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండు చేశారు. శుక్రవారం విజయవాడలోని బాలోత్సవభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాంతో కలిసి ఆయన మాట్లాడారు. రెండు రోజలుపాటు పార్టీ రాష్ట్ర కమిటీ, రెండురోజులు విస్తృత సమావేశం జరిగాయని పేర్కొన్నారు. వీటిల్లో ప్రస్తుత పరిస్థితులపై  చర్చించి భవిష్యత్‌ కర్తవ్యాలు, ఆందోళనా కార్యక్రమాలు రూపొందించడంతోపాటు పలు తీర్మానాలు చేసినట్లు తెలిపారు. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా విశాఖ స్టీలు ప్లాంటు ప్రభుత్వ రంగంలో ఉంటుందా, ప్రైవేటు రంగంలోకి పోతుందా అనే అనుమానాలు పెద్దఎత్తున ఉన్నాయని తెలిపారు.  స్టీలు ప్లాంటుకు కేటాయించిన రూ.11,400 ప్యాకేజీలో కోట్లు జీతాలుకుగానీ, యంత్రాలకుగానీ, ముడిసరుకుకుగానీ వాడొద్దని ఆంక్ష పెట్టారని, ఇంతకంటే అన్యాయం మరొకటి లేదని అన్నారు. వాటిల్లో రూ.500 కోట్లు జిఎస్‌టి, రూ.9346 కోట్లు అప్పులకు పోను రూ.1594 కోట్లు మాత్రమే మిగిలిందని తెలిపారు. ప్యాకేజీ ఇచ్చామని అబద్దాలు చెప్పారని, 5000 మంది ఉద్యోగులను తొలగించి రోడ్డున పడేశారని అన్నారు. ఈ విషయంలో బిజెపి, టిడిపి, జనసేన ప్యాకేజీ పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేశాయని, ఇంతకంటే ద్రోహం, వంచన మరొకటి లేదని విమర్శించారు. అదే సమయంలో మిట్టల్‌ ప్లాంటుకు గనులు, సీపోర్టు కేటాయింపులు చేశారని అన్నారు. ఈ సమయంలో విశాఖ వస్తున్న ప్రధానితో ప్లాంటును ప్రైవేటీకరించబోమని ప్రకటన చేయిస్తే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారని అన్నారు. 

యోగా పేరుతో ప్రజా ధనం వృథా

లక్షలమంది వ్యక్తిగతంగా యోగా వాకింగ్‌ చేస్తున్నారని, రాష్ట్రంలో మానసిక ప్రశాంతత, ఆరోగ్యం పేరుతో యోగా చేయించడం దీనికోసం రూ.70 కోట్లు వృథా చేయడం సరికాదని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు ఉపాధి లేదని, నిరుద్యోగం పెరుగుతోందని, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నారని, తిండి, ఉండటానికి గూడులేని పరిస్థితుల్లో మానసిక ప్రశాంతత ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. వాటిని కల్పించడంతోపాటు పనిభద్రత ఉంటే ప్రశాంతత ఉంటుందని, ప్రభుత్వం ఆ పని చేయడం లేదని అన్నారు. యోగా కోసం ఖర్చు చేసే రూ.70 కోట్లను పిల్లల పౌష్టికాహారానికి అందిస్తే మరింత ఉపయుక్తంగా ఉండేదని తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల వచ్చే శారీరక, మానసిక రుగ్మతలు పోవాలంటే ప్రభుత్వ విధానాలు మారాలి తప్ప యోగవల్ల ఉపయోగం లేదని అన్నారు. అలాగే రెండుకోట్లమంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని చెబుతున్నారని, వాటిల్లో చాలా వరకూ బోగస్‌వేనని అన్నారు. అందులో తన పేరు కూడా చేర్చారని, ప్రభుత్వం నమోదు చేసిన రెండు కోట్లలో ఎన్ని బోగస్‌లని ప్రశ్నించారు. గిన్నీస్‌ రికార్డు కోసం ప్రభుత్వమే అందరికీ రిజిస్ట్రేషన్లు చేసేసిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను ప్రదర్శించారు.

 

గిరిజన యువతకు అన్యాయం

గిరిజన ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని, గిరిజన నిరుద్యోగులకు ఇవ్వాల్సిన పోస్టులను ఇవ్వలేదన్నారు. డిఎస్‌సి ద్వారా 1600 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా కేవలం 84 పోస్టులు మాత్రమే గిరిజనులకు కేటాయించిందని తెలిపారు. దీనిపై గిరిజన సలహా మండలి ఇంతవరకు స్పందించలేదని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ సమస్యపై ఇప్పటికే రెండు సార్లు ఏజెన్సీ ప్రజలు బంద్‌ చేశారన్నారు. కార్పొరేట్లకు మైనింగ్‌ కట్టబెట్టేందుకు ఆ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ల పేరుతో గ్రామాల్లో నుండి గిరిజనులను తరిమేస్తోందని తెలిపారు. కేంద్రం ఒత్తిడితో చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీలో అశాంతిని సృష్టిస్తోందని అన్నారు. ఈ కాలంలో మన రాష్ట్రంలో ఎన్‌కౌంటర్లు లేవని, నిన్న మారేడుమిల్లిలో జరిపిన ఎన్‌కౌంటర్‌పై విచారణ జరపాలని శ్రీనివాసరావు కోరారు. 2023లో రాష్ట్రంలో 40 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటులో కేంద్రం ప్రకటిస్తే వైసిపి ప్రభుత్వం వాటిని  18 వేలకు కుదించిందని, టిడిపి ప్రభుత్వం 16,400 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చిందని విమర్శించారు.

జూన్‌ 26 నాటికి ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తవుతుందని, అప్పట్లో దీనికి వ్యతిరేకంగా పోరాడిన సిపిఎం దాని ప్రమాదాన్ని, ప్రస్తుతం దేశంలో 10 సంవత్సరాలుగా అమలౌతున్న అప్రకటిత ఎమర్జెన్సీని ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సభలు నిర్వహించే హక్కు బిజెపికి లేదని అన్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో దళిత సర్పంచ్‌ పట్ల వివక్షాపూరితంగా వ్యవహరించిన బిజెపి ఎమ్మెల్యేను బాధ్యతల నుండి తొలగించాలని కోరారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి మాట్లాడుతూ  కుప్పంలో వడ్డీ వ్యాపారులు మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం అన్యాయమని అన్నారు. ‘‘తల్లికి వందనం’’ డబ్బు మైక్రో ఫైనాన్స్‌ సమస్యల వడ్డీలకు చెల్లించాల్సి వస్తుందని ఇదేనా మహిళా సాధికారత అని అన్నారు.

ప్రతీకార ప్రకటనలు సరికాదు

రాష్ట్రంలో ప్రజా సంక్షేమం మాని ప్రతీకార, రెచ్చగొట్టే ప్రకటనలకు ప్రాధాన్యత ఇస్తున్నారని, ఇది రాష్ట్ర భవిష్యత్‌కు, ప్రజల సంక్షేమానికి మంచిది కాదన్నారు. టిడిపి, వైసిపికి చెందిన రెండు పార్టీల నాయకలూ నేరాలకు మీరు కారణం అంటే మీరే కారణం అని పరస్పరం దూషించుంటున్నారని వీటిని ప్రతి ఒక్కరూ ఖండిరచాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు రెండు జాగ్రత్తగా వ్యవహరించాలని, ఇలాంటి ప్రకటనల వల్ల ప్రజలకు మేలు జరగకపోగా అరాచకం, అన్యాయాలు పెరుగుతాయని అన్నారు.

= = = =