
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 06 సెప్టెంబరు, 2025.
విద్యార్ధుల అక్రమ అరెస్టులకు ఖండన
అరెస్టు చేసిన వారిని బేషరుతుగా విడుదల చేయాలి.
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్ధులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించి రాష్ట్ర విద్యాశాఖామంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు శాంతియుతంగా ర్యాలీగా వెళుతున్న విద్యార్ధినీ, విద్యార్ధులను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్లో నిర్భంధించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నది.
పెండిరగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, పి.జి విద్యార్ధులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా అడ్డుకునే జివో 77ని రద్దు చేయాలని, హాస్టల్లో రిపేర్లు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు మెరుగుపర్చి, మెస్ ఛార్జీలు పెంచాలని, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. చివరగా విజయవాడలో ధర్నా నిర్వహించి విద్యాశాఖా మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న విద్యార్దినీ, విద్యార్ధులపై పోలీసులు పిడిగుద్దులు కురిపిస్తూ, ఇష్టారీతిన వ్యాన్లలో పడేసి సుమారు 200 మందిని అరెస్టు చేసి సింగ్నగర్, సత్యనారాయణపురం, 1టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించడం గర్హనీయం. పోలీసులు ఈ విధంగా విద్యార్ధినీ, విద్యార్ధుల పట్ల వ్యవహరించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ నిరసిస్తున్నది.
అరెస్టు అయిన వారిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామ్మోహన్, కె.ప్రసన్నకుమార్, వెంకటేష్, సమీరా తదితరులు ఉన్నారు. అరెస్టు అయిన వారిని పోలీసు స్టేషన్కు వెళ్ళి సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, ఎన్టిఆర్ జిల్లా కార్యదర్శి డి.వి.కృష్ణ, నాయకులు రమణ, సత్యబాబు పరామర్శించారు. అరెస్టు అయిన వారిని తక్షణమే విడుదల చేయాలని, వారి న్యాయమైన డిమాడ్లు పరిష్కరించాలని సిపిఐ(యం) కోరుతున్నది.
(జె.జయరాం)
ఆఫీసు కార్యదర్శి
