
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 12 జూన్, 2026.
అమెరికా దాడిలో మృతిచెందిన
భారత నావికా అధికారులకు సంతాపం
అమెరికా దాడులను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించాలి
ఒమన్ తీరంలో భారత ఆయిల్ ట్యాంకర్ పై అమెరికా జరిపిన దుర్మార్గమైన దాడిలో ముగ్గురు నావికా అధికారుల మరణం పట్ల సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటిస్తున్నది. ఈ దాడిలో విశాఖవాసి పట్నాల సురేష్ మృతి చెందటం బాధాకరం. ఆయన మృతికి సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ నివాళులు అర్పిస్తున్నది. వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నది. అమెరికా దురహంకారానికి ముగ్గురు భారత నావికులు బలైపోయారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేవలం ఇరాన్ నుండి చమురు కొనుగోలు చేసిందనే నెపంతోనే భారత్ నౌకలపై అమెరికా దాడి చేయడం గర్హనీయం. భారత వాణిజ్య నౌకలపై అమెరికా నావికాదళం ఈ వారం రోజుల్లోనే 3సార్లు దాడి జరిపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం బేషరతుగా అమెరికాకు వత్తాసు పలకడం సిగ్గుచేటు. అమెరికా ఆంక్షలకు లోబడి ఉన్నప్పటికీ భారత నౌకలపై దాడి చేయడం మన సార్వభౌమాధికారాన్ని సవాలు చేయడమే. కేంద్ర ప్రభుత్వం లొంగుబాటుతనానికి ఇది అద్దం పడుతోంది. దీనిపై మోడీ మౌనం దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది.
పశ్చిమాసియాలో అమెరికా దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించాలని సిపిఐ(యం) డిమాండ్ చేస్తున్నది. అమెరికా దుర్మార్గాలను ప్రతి ఒక్కరు ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
