ప్రభుత్వతీరు సిగ్గుచేటు:మధు

విజయనగరం జిల్లా తోటపల్లి బ్యారేజి ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా సిపిఎం నాయకులను, రైతు నాయకులను అరెస్టు చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి మధు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తోటపల్లి నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని, ప్రాజెక్టు కింద కాల్వలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించాలని ప్రాజెక్టు నిర్వాసితులతో పాటు రైతు సంఘాలు కూడా నిర్ణయించాయని తెలిపారు. వారికి అనుమతి ఇవ్వకపోగా ఇళ్ల నుంచి అర్ధరాత్రి సిపిఎం నాయకులను, నిర్వాసితుల నాయకులు బి రమణ, బి దాసు, సదానందంలను అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ అరెస్టులు అత్యంత గర్హనీయమని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేసే అవకాశం లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటని విమర్శించారు.