వినాశనంలో విద్య..

 విద్య సరుకుగా మారటం, విద్య మతతత్వీకరణకు గురికావటం అనే రెండు మార్గాలలో విద్య నాశన మౌతోంది. పాలనా రంగంలో కొనసాగుతున్న కార్పొ రేట్‌- మతతత్వ మైత్రి ప్రతిరూపమే విద్యా రంగంలో సహజీవనం చేసు ్తన్న ఈ రెండు ధోరణులు.
                 విద్యా రంగంలోని ప్రధాన స్థానాలలో మిడిమిడి జ్ఞానమున్న విశ్వాసపాత్రులను ఎన్‌డిఎ ప్రభుత్వం నియమించటం ఆందోళన కలిగించే విషయం. దీనితో విద్యా వ్యవస్థ దెబ్బతింటున్నది. అయితే ఇదొక్కటే విద్యా వ్యవస్థకు ప్రమాదకారి కాదు. పెట్టుబడిదారీ ప్రపంచీకరణ తనతోపాటు విద్యారంగాన్ని నాశనంచేసే ప్రక్రియను మోసుకొచ్చింది. భారతదేశానికి సంబంధించినంత వరకు విద్యా రంగంలో మతతత్వ ఫాసిజం చొరబాటు ఒక ప్రధానమైన అదనపు అంశం. ఈ వినాశన ప్రక్రియను, దానికి చెందిన 'ఎలా', 'ఎందుకు' అనే వాటిని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాల్సి ఉంది. బ్రిటీష్‌ సాహితీ సిద్ధాంతవేత్త టెర్రీ ఈగల్‌టన్‌ ఒక పిట్ట కథను చెబుతుంటాడు. తాను దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న సమయంలో ఒక విశ్వవిద్యాలయ సిఇఒ(ఈ రోజుల్లో విశ్యవిద్యాలయ ముఖ్య పాలనాధికారులను అలానే పిలుస్తున్నారు) తనకు ఆ విశ్వవిద్యాలయానికి సంబంధించిన అధునాతన యాంత్రిక ఉపకరణాలను, నిగనిగలాడే ప్రయోగశాలలను చూపించిన తరువాత ఆయన 'విమర్శనాత్మక అధ్యయనాల' విభాగాన్ని చూడాలని ఉందని చెప్పాడు. ఆ ప్రశ్న విన్న సిఇఒ గందరగోళంలో పడ్డాడు. అదేమిటో సహాయకుణ్ణి అడిగి తెలుసుకోవటానికి విఫలయత్నం చేసి ఇలా అన్నాడు: 'మేము ఆ విషయం గురించి ఆలోచిస్తాం!' మరింత మానవతా విలువలుగల సమాజాన్ని నిర్మించటానికి అస్తిత్వంలోని నిర్మాణాలను విమర్శనాత్మక విశ్లేషణకు గురిచేసే పాత్రను నిర్వహించే విద్యను ప్రపంచవ్యాప్తంగా నిర్వీర్యం చేశారు. విద్యను సరుకుగా మార్చటం అనే ప్రధాన సాధనంతోనూ, ప్రయివేటీకరణ, విద్యను లాభసాటి రంగంగా మార్చటం అనే ప్రక్రియ ద్వారానూ ఇది జరిగింది.
                 'విద్య'ను లాభం కోసం సరుకుగా అమ్మే ప్రయివేటు సంస్థలు తాము లాభం కోసమే పనిచేయమని, ఎందుకంటే మిగిలినదంతా తిరిగి సంస్థ అభివృద్ధికే వినియోగిస్తామని ఆ సంస్థలు చెబుతాయి. కానీ పెట్టుబడిదారీ కంపెనీలు కూడా తమ లాభాలను తిరిగి తమ సంస్థల అభివృద్ధికే వినియోగిస్తాయి. అయినప్పటికీ వాటిని లాభాలు గడించే సంస్థలుగా పిలవటానికి అడ్డు ఏమీలేదు. కాబట్టి లాభాలను తిరిగి వ్యయం చేయటంలో పెద్ద సుగుణం ఏమీ లేదు. తిరిగి వ్యయం చేసినా, చేయకపోయినా లాభాలు లాభాలే. లాభాలు గడించే సంస్థలు లాభాపేక్షగలవే. తమ లాభాలను తిరిగి తమ కోసమే వ్యయం చేసినంత మాత్రాన వాటిని లాభాపేక్ష లేనివిగా భావించజాలం. విద్యను సరుకుగా మార్చితే పేదలు చదువుకు దూరమవుతారనే అంతర్భావాన్ని అర్థ చేసుకోవటం, చర్చించటం జరిగింది. ధనికులు కానివారు కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని చదువుకోవచ్చని నయా ఉదారవాద సమర్థకులు వాదిస్తారు. అయితే ఉద్యోగం వస్తుందనే నమ్మకంలేని సమాజంలో గత పదిహేను సంవత్సరాలుగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లుగా అప్పుచేసి చదువుకున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవటానికి దారితీస్తుంది. అప్పు తీర్చవలసిన సమయంలో తీర్చటానికి తగినంత వనరులు లేకపోవటంతో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ మార్గాన్ని అనుసరించటానికి వెనుకాడతారు. కాబట్టి లాభాలను గడించే ప్రయివేటు విద్యా సంస్థలు అమ్మే సరుకుగా విద్య మారిన భారతదేశంలో అత్యధిక శాతం విద్యార్థులకు అది అందుబాటులో ఉండదు. వీరందరూ పేద కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవారే.
సరుకుగా మార్చడంతో నాశనమయ్యే సృజనాత్మక
               క్లుప్తంగా చెప్పాలంటే విద్య సరుకుగా మారినప్పుడు విద్యార్థులలో జిజ్ఞాసను పెంచటం, ఆలోచనా ప్రపంచాన్ని పరిచయం చేసి వారిని ఉత్తేజపరచటం వంటి పాత్రను అది నిర్వహించజాలదు. ఉద్యోగ విపణిలో మంచి విలువను పొందటానికి అనివార్యంగా ఆకళింపుచేసుకోవలసిన గుళికగా విద్యార్థులు విద్యను చూస్తారు. సరుకుగా మారిన విద్య విద్యార్థులలో సృజనాత్మకతను, సహజత్వాన్ని నాశనం చేస్తుంది. తమకు నిర్దిష్టపరచిన దాన్ని దాటిపోవాలనే కోరికను చంపుతుంది. నిర్దిష్ట పరిచిన దాన్ని దాటిపోవటమే సృజనాత్మక లక్షణం అయినప్పుడు సరుకుగా మారిన విద్య సృజనాత్మకను నాశనం చేస్తుంది. ఆశ్చర్యకరంగా సంప్రదాయక పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద దేశాల కంటే భారత్‌ వంటి 'నూతనంగా ఆవిర్భవిస్తున్న' దేశాలలో అలాంటి సరుకీకరణ అమిత వేగంగా జరుగుతోంది. 'విద్యావంతుల్లో' సరుకుగా మార్చబడిన విద్య సామాజిక సున్నితత్వాన్ని లేకుండా చేస్తుంది. వారిని కష్టజీవులపట్ల సానుభూతిలేని స్వార్థపరులుగా మారుస్తుంది. వేలాది సంవత్సరాలుగా అసమానతలు వ్యవస్థీకృతమై, పుట్టుకతోనే కష్టజీవులను 'చిన్నచూపుచూడటం' అలవాటుగామారే కులపరమైన అణచివేతకు ఆలవాలమైన మనలాంటి సమాజంలోని 'విద్యావంతులకు' ఈ లక్షణం తేలిగ్గా అబ్బుతుంది. సరుకుగా మార్చబడిన విద్యకున్న ఈ లక్షణాలన్నీ సమకాలీన పెట్టుబడిదారీ వ్యవస్థకు కూడా అనుకూలంగానే ఉన్నాయి.
కానీ, నేటి సంక్షోభ శకంలో మేధోపరమైన ప్రతిఘటనను నీరుగార్చటం ద్వారా సరుకుగా మారిన విద్య నయా ఉదారవాద ప్రయోజలకు అనుగుణంగా పనిచేస్తున్నప్పటికీ కష్టజీవుల ప్రతిఘటన రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ ప్రతిఘటనను ఎదుర్కోవటానికి ప్రపంచీకరింపబడిన కార్పొరేట్‌-ఫైనాన్షియల్‌ బూర్జువా వర్గానికి 'మతతత్వ ఫాసిజం'తో జతకట్టవలసిన అవసరం ఏర్పడింది. అలాంటి 'కార్పొరేట్‌-మతతత్వ మైత్రి' ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వ పాలనకు దన్నుగా ఉన్నది. మత కలహాలను రెచ్చగొట్టి, ఉత్తర ప్రదేశ్‌ వంటి ప్రధాన ప్రాంతాలలో 'మతపరమైన' కేంద్రీకరణ జరిగేలాచేసి, కార్పొరేట్‌-ఫైనాన్షియల్‌ బూర్జువా వర్గం అందించిన ధన రాశుల ప్రభావంతో 2014లో ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చింది. అలా అధికా రంలోకి వచ్చిన ఎన్‌డిఎ తమ కార్పొరేట్‌ యజమానుల బాకీ తీర్చుకు నేందుకు పేదల సంక్షేమ వ్యయంలో కోత విధించటం, భూ సేకరణ ఆర్డినెన్స్‌ను జారీచేయటం (పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కి ఈ ఆర్డినెన్స్‌ను ఇప్పటికే మూడుసార్లు పొడిగించటం జరిగింది), 'శ్రామిక మార్కెట్‌ సరళీకరణ'ను రుద్దేందుకు ఉద్దేశిం పబడిన చట్టాన్ని తేవటం లాంటి ప్రయత్నాలు చేయటంలో తలమున కలై ఉన్నది. తమ భావజాలాన్ని, తమ వారిని విద్యా వ్యవస ్థలోకి చొప్పించడానికి ఈ మైత్రిలో భాగమైన 'మతతత్వ-ఫాసిస్టు' శక్తులకు అవకాశం లభించింది. క్లుప్తంగా చెప్పాలంటే విద్య సరుకుగా మారటం, విద్య మతతత్వీకరణకు గురికావటం అనే రెండు మార్గాలలో విద్య నాశన మౌతోంది. పాలనా రంగంలో కొనసాగుతున్న కార్పొ రేట్‌- మతతత్వ మైత్రి ప్రతిరూపమే విద్యా రంగంలో సహజీవనం చేసు ్తన్న ఈ రెండు ధోరణులు. ఈ రెండు ధోరణులకు ఎలాంటి వైరుధ్యమూ లేదు.
చూసీచూడగానే ఇది వింతగా కనిపించవచ్చు. అందరూ అనుకుంటున్నట్లుగా ఉన్నత విద్యను పునరుద్ధరించవలసిన అవసరమున్న 'జ్ఞాన ఆర్థిక వ్యవస్థ'లో మనం లేమా? 'జ్ఞానాభిలాష ఉన్న' మెదళ్ళలో హిందూత్వ గులక రాళ్ళను నింపుతున్నప్పుడు, పురాణాలకు, చరిత్రకు మధ్య తేడాను చెరుపుతున్నప్పుడు, పేదల, అణగారిన ప్రజల పట్ల ద్వేష భావాన్ని పెంపొందిస్తున్నప్పుడు కచ్చితంగా అలాంటి పునరుద్దరణ జరగటం సాధ్యపడదు. కనీసం కార్పొరేట్‌ పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాల కోసమైనా హిందూత్వ శక్తులకు కళ్ళెంవేసి, విద్య 'మతతత్వీకరణను' ఆపాలి.
జ్ఞానం, ప్రజ్ఞల మధ్య తేడా
అయితే 'జ్ఞాన ఆర్థిక వ్యవస్థ' గురించి చేసే వాదనలో 'జ్ఞానం', 'ప్రజ్ఞ'ల మధ్య గల తేడాను విస్మరించటం జరుగుతోంది. ఆలోచనా ప్రపంచంతో విమర్శనాత్మకంగా వ్యవహరించటంవల్ల ఏర్పడే 'జ్ఞానాన్ని' కార్పొరేట్‌ పెట్టుబడి మనలాంటి దేశాల్లో కోరుకోవటం లేదు. అలాంటి జ్ఞానం అందుబాటులో లేకపోతే ప్రకృతి శాస్త్రాలలో జరిగే మౌలిక పరిశోధన దెబ్బతింటుంది. కానీ మనం అలాంటి పరిశోధనల ఫలితంగా అందుబాటులోకి వచ్చే ఉత్పాదనలను అభివృద్ధి చెందిన దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు. దేశంలోని కార్పొరేట్‌ పెట్టు బడిదారీ వర్గం కానీ, సామ్రాజ్యవాదం కానీ దేశంలో మౌలిక పరిశో ధనలను ప్రోత్సహించాలనుకోవటం లేదు. మొదటిది అలాంటి పరిశో ధన అవసరం లేదని అనుకుంటుంది(అలాంటి పరిశోధన ఫలితాలను అభివృద్ధి చెందిన దేశాల నుంచి దిగుమతి చేసుకోవటమే దానికి ఇష్టం). రెండవదైన సామ్రాజ్యవాదానికి అభివృద్ధి చెందిన దేశాల మేధో ఆధిప త్యాన్ని, దాని మీద ఆధారపడే మనలాంటి దేశాల మేధోపరాన్న జీవనా న్ని కొనసాగించటమే ఇష్టంగా ఉంటుంది. సామాజిక, మానవీయ శాస్త్రాలకు సంబంధించినంత వరకు ఆలోచనా ప్రపంచంతో విమర్శనా త్మకంగా వ్యవహరించటం వల్ల ఏర్పడే 'జ్ఞానం' ప్రమాదకరమైనదిగా కార్పొరేట్‌-మతతత్వ శక్తులు భావిస్తాయి. ఎందుకంటే అలాంటి జ్ఞానం మార్క్సిస్టు, అంబేద్కరైట్‌, ప్రగతిశీల జాతీయవాద, లౌకిక ప్రజాస్వామిక, స్త్రీ విమోచక భావాలను జనింపజేస్తుంది. ఇవన్నీ కార్పొరేట్‌ పెట్టుబడిదారుల, హిందూ మతతత్వ శక్తుల 'ఎర్ర భయం'లో భాగం(కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వశాఖ మెప్పు పొందటానికి చెన్నరు ఐఐటిలో అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌ను నిషేదించటానికి చేసిన ప్రయత్నం ఆసక్తిదాయకమైనది. ఈ స్టడీ సర్కిల్‌ను కొందరు 'ఎర్ర సంస్థ'గా వర్ణించారు). కార్పొరేట్‌ పెట్టుబడికి జ్ఞానం కంటే 'ప్రావీణ్యతలు' అవసరం. అవి చౌకగా లభించాలి. అంతర్జాతీయ పెట్టు బడికి మనలాంటి దేశంలో 'ప్రావీణ్యత గల సిబ్బంది' కావాలి. ఈ సిబ్బంది తక్కువ వేతనాలు తీసుకుంటూ పెట్టుబడి లాభాలను మరిం తగా పెంచుతారు. వీరు చేసేపనికే అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస ్థలలోని సిబ్బందికి చెల్లించే వేతనాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
విద్యారంగంపై ఎన్‌డిఎ ప్రభత్వం తయారుచేసిన ప్రతి పత్రమూ 'ప్రయివేటీకరణ, పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం' ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ఎందుకంటే విద్య మతతత్వీకరణకు విద్య ప్రైవేటీకరణ బాగా వుపయోగపడుతుంది. ఇక్కడ మరో విషయం ఉన్నది.

       'ఆర్థిక కారణాలను' సాకుగా చూపించే ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగంలో ఎటూ లాభార్జనే ప్రధాన ధ్యేయంగా ఉంటుంది గనుక నామమాత్రపు వేతనాలతో విపరీతంగా పనిచేసే తాత్కాలిక లేక 'గెస్ట్‌' ఉపాధ్యాయులను నియమించే ధోరణి ఉన్నది. క్లుప్తంగా చెప్పాలంటే ఉపాధ్యాయులలో ద్వంద్వ ధోరణి ఉంటుంది. ఒకవైపు మంచి వేతనాలు పొందుతున్న ప్రొఫెసర్లుంటే, మరోవైపు నామమాత్రపు వేతనాలతో బ్రతుకులీడిస్తున్న అధ్యాపకులుంటారు. ఇది కూడా కార్పొరేట్‌-మతతత్వ శక్తుల ఐక్య సంఘటనకు అనువుగా ఉంటుంది. మంచి వేతనాలు, హోదా గల ప్రొఫెసర్లు వాటిని కోల్పోతామనే భయంతో ప్రభుత్వాన్ని విమర్శనాత్మక దృష్టితో చూడటానికి జంకుతారు. అలాగే ఎక్కువ పనిచేస్తూ తక్కువ వేతనాలు తీసుకుంటున్న 'అణగారిన' అధ్యాపకులు ఎటూ అభద్రతా భావంలో ఉంటారు కాబట్టి వారిని తేలిగ్గా లొంగదీసుకోవచ్చు. అయితే అలా నిర్మించబడుతున్న ద్వంద్వ, యథాతథవాద నిర్మాణాలు విద్యను మరింతగా నాశనం చేస్తాయి.
ప్రభాత్‌ పట్నాయక్‌