సిపిఎం నాయకులపై అక్రమ కేసులు దారుణం

పేదల కోసం పోరాడుతున్న సిపిఎం నాయకులపై అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు అన్నారు. భూ పోరాటంలో అరెస్టయిన సిపిఎం జోన్‌ కార్యదర్శి బి.రమణి, నాయకులు అప్పలరాజు విడుదలైన సందర్భంగా సుజాతనగర్‌లో ఆదివారం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ల్యాండ్‌ పూలింగ్‌ను తమతో పాటు విజయసాయిరెడ్డి కూడా వ్యతిరేకించారని, ఇప్పుడు ఏ విధంగా చేపడతారని ప్రశ్నించారు. ఇక్కడి ప్రజలకు ఎక్కడో పద్మనాభపురం, ముదపాక శివారు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలిస్తే ఏలా ఉంటారని ప్రశ్నించారు. నివాసమున్నచోటే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఉగాది నాటికి ఇళ్ల స్థలాలిస్తామని చెప్పారని, ఇప్పుడు ఎన్నికల కోడ్‌ రావడంతో ఏ విధంగా ఇళ్ల స్థలాలిస్తారో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పాలన్నారు. సిపిఎం నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా పోరాటం మాత్రం ఆగదని స్పష్టంచేశారు.