ఎన్నికల కమిషనర్‌ తొలగింపు న్యాయ సమ్మతమా?

తాజా పరిణామాన్ని చూస్తే ఏం జరిగినా సరే మడమ తిప్పేది లేదన్నట్లుగా జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని మూడు సంవత్సరాలకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫార్సును ఆర్డినెన్స్‌ ద్వారా గవర్నర్‌ అమలు చేశారు. గవర్నర్‌ ఆమోదం పొందిన తరువాత కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరొక ఉత్తరువు జారీ చేసింది. కొత్త కమిషనర్‌ నియామకం కూడా జరిగిపోయింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో పెద్ద తప్పిదం చేశారా లేక సలహాదారులు తప్పుదారి పట్టించారా? ఏదైనా ఒకటే. కమిషనర్‌ పదవీ కాలం తగ్గింపు, ఆ వెంటనే తొలగింపు చట్టబద్ధమా, విరుద్ధమా అన్న చర్చ ప్రారంభమైంది.
జగన్‌ మోహన్‌ రెడ్డి పాలన మీద కేంద్రీకరించటం కన్నా తన రాజకీయ ప్రత్యర్ధుల మీద, గత పాలనలో వారికి సహకరించిన ఉన్నతాధికారుల మీద కక్ష తీర్చుకొనేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. వాటిని ఆరోపణలుగా భావించి వైసిపికి మద్దతు ఇస్తున్న వారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం తగ్గింపు ఆర్డినెన్స్‌ ద్వారా దొడ్డి దారిన రమేష్‌ కుమార్‌ను తొలగించటంతో సి.ఎం కక్షపూరిత వైఖరిని నిర్ధారించుకుంటున్నారు.
స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన కమిషనర్‌ నియామకం పై తమ ముఖ్యమంత్రి అనవసరంగా ప్రతిష్టకు పోయి దెబ్బతిన్నారని భావిస్తున్న వైసిపి నేతలు, కార్యకర్తలు ఇప్పుడు తొలగింపునకు అనుసరించిన పద్ధతిని ఉన్నత న్యాయస్థానాలు అంగీకరించకపోతే తాము ఏ ముఖంతో బయటకు రావాలనే ఆందోళనకు గురవుతున్నారు. కరోనా కారణంగానే గతంలో ఎదురుదెబ్బలు తిన్న అనుభవం గమనంలో ఉంటే ఇప్పుడు ఆ కరోనా మరింత ఉధృతంగా ఉన్న సమయంలో ఇలాంటి చర్యను వైసిపి కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేరు.
ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలం, నియామకం గురించి స్వతంత్ర విధానాన్ని అనుసరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అయితే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల వ్యవధికి రమేష్‌ కుమార్‌ను నియమించింది. అది ముగిసే లోగా ఏ కారణాలతో అయినా నియమిత వ్యక్తులు రాజీనామా చేస్తే లేదా అరవై అయిదు సంవత్సరాలు నిండి వైదొలగాల్సి వస్తే ఆ స్థానంలో కొత్త వారిని నియమించటం వేరు. లేదా కమిషనర్‌ తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చినపుడు తొలగించాలంటే ఒక హైకోర్టు న్యాయమూర్తిని ఏ పద్ధతుల్లో తొలగించాలో అదే పద్ధతిని పాటించాల్సి ఉంటుంది. పార్లమెంట్‌ ఆమోదం అవసరం. అందువల్ల అది అంత తేలిక కాదు కనుక జగన్‌ సర్కారు వేరే మార్గాన్ని ఎంచుకుంది. అది చట్టబద్ధమా కాదా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. తన తొలగింపును సవాల్‌ చేస్తూ రమేష్‌ కుమార్‌ కోర్టును ఆశ్రయించారు కూడా. ప్రజాప్రయోజనాల రీత్యా ప్రభుత్వ చర్యను సవాలు చేస్తూ ఇతరులు సైతం ఎవరైనా కోర్టుకు వెళ్లవచ్చన్నది ఒక వాదన.
కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్‌ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో సుప్రీం, ముఖ్యమంత్రా లేక ఎన్నికల కమిషనరా అని స్వయంగా జగన్‌ మోహన రెడ్డి ప్రశ్నించటమే కాదు, సుప్రీం కోర్టుకు వెళ్లి మొట్టికాయలు తిన్నారు. కమిషనర్‌ నిర్ణయమే సుప్రీం అని నిర్ధారించుకున్నారు. అయితే దాన్ని జీర్ణించుకోలేకపోయారన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. దానికి ప్రతీకారం తీర్చుకుంటారని అందరూ భావించినా...అది ఇలా, ఈ సమయంలో ఉంటుందని ఎవరూ ఊహించలేదు. కరోనా కారణంగా దృష్టి అంతా అటు వైపు ఉంది. ఈ సమయంలో కొత్త రాజకీయ వివాదాలకు తెర లేపుతారని ఎవరూ ఊహించలేదు.
అయితే వెనుకటి తేదీ నుంచి అమలు జరిగే నిర్ణయం చట్టబద్ధమైతే ఏ క్షణంలో అయినా తొలగించేందుకు అవకాశం ఉంది. కరోనా కష్ట కాలంలో ఆర్డినెన్స్‌ ద్వారా యావత్‌ రాజకీయ వర్గాలు విస్తుపోయేలా రాజకీయానికి పూనుకోనవసరం లేదు. గాలికి పోయేదాన్ని తలకెత్తు కోవాల్సిన అగత్యం అంతకంటే లేదు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత ఎలాగూ బడ్జెట్‌ అసెంబ్లీ సమావేశాలు జరపాల్సి ఉంటుంది. చర్చ లేకుండానే ఆమోదించే మద్దతుదారులు ఎలాగూ ఉన్నారు గనుక ఆ సమయం లోనే ఆర్డినెన్స్‌ ద్వారా చేసిన దాన్ని బిల్లు ద్వారానే చేయవచ్చు. తొందర పడకుండా ప్రజాస్వామ్యబద్దంగానే చేశారనే విమర్శలు రాకుండా చూసుకోవచ్చు. కరోనా వ్యాప్తి తగ్గే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగూ జరగవు. ఈలోగా కమిషనర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేదేమీ ఉండదు.
ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యల ద్వారా జగన్‌ మోహన్‌ రెడ్డి ఏం సాధిస్తారు? ఎలా లబ్ధి పొందుతారన్నది ఒక అంశం. ఆర్డినెన్స్‌ ద్వారా ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని సవరించారు. అది పూర్వపు తేదీ నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ను 2016 ఏప్రిల్‌ ఒకటవ తేదీన నియమించారు. ఒకసారి నియమించిన తరువాత సదరు వ్యక్తి పదవీకాలం పూర్తి అయిన తరువాతే కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నది ఒక వాదన. 'కాదు..వెనుకటి తేదీ నుంచి కూడా అమలు చేయవచ్చు' అన్నది సర్కార్‌ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎన్నికల కమిషర్ల విషయంలో ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ ఎదురు కాలేదు. అయితే సమాచార కమిషనర్ల నియామకం, వారి హోదాల విషయంలో ప్రభుత్వాలు చేసిన మార్పులు కొత్తగా నియమించబోయే వారికి తప్ప ప్రభుత్వం కొత్త విధానాన్ని ఖరారు చేసే సమయానికి పదవుల్లో ఉన్న వారికి గత విధానాలే వర్తిస్తాయని సుప్రీం కోర్టు చెప్పింది. ఆ తీర్పు ప్రకారం అయితే జగన్‌ మోహన్‌ రెడ్డి కి మరో గట్టి దెబ్బ తగలనుంది. అది కార్యకర్తలు, నేతల్లో జగన్‌ పట్ల ఉన్న ఆరాధన స్థానంలో చులకన భావం కలగటానికి నాంది అవుతుంది. ఇప్పటికే మడి కట్టుకొని ఉన్నవారు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.
ఈ వివాదం తమ ముందుకు వస్తే ఉన్నత న్యాయ స్థానాలు ఏం తీర్పు ఇస్తాయన్నది ఆసక్తికరం. ఇటీవల వెలువడిన కొన్ని తీర్పులను చూస్తే గత తీర్పులను అనుసరిస్తాయనేదేమీ లేదు. చట్టానికి చేసే వ్యాఖ్యానాలు మారిపోతున్నాయి. ఒకవేళ వెనుకటి తేదీతో అమలు జరిపే ఆర్డినెన్స్‌ చెల్లదని తీర్పు వస్తే జగన్‌ పరువు మరింత పోతుంది. ఇప్పటికే కరోనా కారణంగా ఎన్నికల వాయిదాను రచ్చ చేసి పార్టీ కార్యకర్తలను ఇబ్బందుల్లోకి నెట్టారన్న భావం ఉంది. ఎన్నికల రద్దు నిర్ణయం తరువాత జరిగిన పరిణామాలను చూస్తే కమిషనర్‌ చర్యే సరైందన్నది స్పష్టం. అయితే అది ప్రభుత్వంతో సంప్రదించి చేసి ఉండాల్సింది.
ఒక వేళ ప్రభుత్వ చర్యను ఉన్నత న్యాయస్థానాలు సమర్ధిస్తే 'చూశారా...మా తడాఖా!' అని జబ్బలు చరుచుకోవటం తప్ప వైసిపి కి అదనంగా వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమిటన్నది అయోమయం. అంతే కాదు. అది కొత్త సమస్యలను ముందుకు తెస్తుంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టంలో జరిగిన దాడులు, బలవంతపు ఉపసంహరణలు, ఇతర అక్రమాల గురించి కొందరు ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఉద్వాసనకు గురైన కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ సిఫార్సు చేశారు. ఆ అంశాలతో కూడిన ఒక లేఖ కేంద్రానికి కమిషనర్‌ నుంచి అందినట్ల్లు, అవసరమైనపుడు దాని గురించి రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరతామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌ రెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఎలాంటి కోర్టు వివాదాలు లేకుండా లేదా కోర్టు అనుమతిస్తే కొత్త కమిషనర్‌ గత కమిషనర్‌ చేసిన సిఫార్సులను రద్దు చేస్తారా? వచ్చిన ఫిర్యాదుల మీద ఏ చర్య తీసుకుంటారు? కేంద్రానికి రాసిన వివాదాస్పద లేఖను కూడా ఉపసంహరించుకుంటారా? అదే జరిగితే కేంద్రం ఏ వైఖరి తీసుకుంటుంది అన్న ప్రశ్నలు ముందుకు వస్తాయి.
దీనిని పక్కనబెట్టి జగన్‌ సర్కార్‌ ముందు కరోనా బాధిత పేదలను ఆదుకోవటం గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు వస్తున్నా పట్టించుకోక నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అంశాలను ముందుకు తెస్తూ కరోనా పట్ల నిర్లక్ష్యంగానే ఉన్నారని, కేంద్రం ఏ సాయమూ అందించక పోయినా పల్లెత్తు మాట కూడా అనడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ ధోరణే గనుక కొనసాగితే కక్ష తీర్చుకోవటం మీద ఉన్న శ్రద్ధ కష్టకాలంలో ఉన్న జనాల మీద లేదనే తీవ్ర విమర్శ, జనాగ్రహానికి గురికావాల్సి ఉంటుంది.

- ఎం.కోటేశ్వరరావు