కార్పొరేటర్ సత్యబాబు దీక్షకు మద్దతు

కార్పొరేటర్ సత్యబాబు దీక్షకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మద్దతు తెలిపారు.

విజయవాడ మున్సిపల్ కార్యాలయం వద్ద అరెస్ట్ చేసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కార్పొరేటర్ సత్యబాబుని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పరామర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తి ఆధారిత ఇంటిపన్ను పెంపుపై బుధవారం విజయవాడ కార్పోరేషన్ లో అడ్డగోలుగా వైసిపి ప్రభుత్వం ఆమోదించుకుందని మండిపడ్డారు.

ఈ నిరంకుశ విధానాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయి సత్యబాబు కార్పోరేషన్ ఆఫీసులో చేస్తున్న నిరాహారదీక్షను భగ్నం చేస్తూ పోలీసులు బుధవారం అర్ధరాత్రి 2గం.లకు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో కానీ, ప్రతిపక్షాలతో కానీ చర్చించకుండా ఏకపక్షంగా ఇంటిపన్ను జీవోను ఆమోదించుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

కార్పొరేటర్ సత్యబాబు మాట్లాడుతూ ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తారని తెలిపారు. ఆస్తిపన్ను జీవో 198పై బుధవారం నాడు జరిగిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో సవరణల తీర్మానాలపై చర్చించకుండా ఏకపక్షంగా వైసిపి ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయం విదితమే.