పార్లమెంట్‌ సాక్షిగా విశాఖ ఉక్కుపై బిజెపి దాడి

విశాఖ ఉక్కు అమ్మకంపై ప్రజల్లో వ్యక్తమౌతున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేని బిజెపి...దుష్ప్రచారానికి పార్లమెంటు వేదికగా పూనుకుంది. తన సన్నిహిత కార్పొరేట్‌ వర్గానికి దీనిని ధారాదత్తం చేయడానికి ప్రజల్లో విశాఖ ఉక్కు ఖ్యాతిని మసకబార్చేందుకు కుట్ర పన్నింది. మొన్న పార్లమెంటులో విశాఖ ఉక్కుపై సభ్యులు అడిగిన ప్రశ్నలను ఆసరా చేసుకొని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి విషం కక్కారు. వాస్తవాలకు పాతరేసి తీవ్రమైన అబద్ధాలు వల్లించారు. అబద్ధం 1: విశాఖ ఉక్కుకు కేప్టివ్‌ మైన్స్‌ లేకపోవడం వల్ల నష్టాలు రాలేదు. ఇది పచ్చి అబద్ధం. కేప్టివ్‌ మైన్స్‌ అంటే ప్రభుత్వం ఉక్కు పరిశ్రమలకు ముడి ఇనుప గనులు కేటాయించడం. దేశంలో సొంత ముడి ఇనుప గనులు లేని ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ స్టీల్‌ పరిశ్రమలకు ప్రభుత్వం సొంత ఇనుప గనులు కేటాయించింది. ఇంకా నిర్మాణం జరగని బ్రాహ్మణి స్టీల్‌కి, పోస్కోకి కూడా సొంత ముడి ఇనుప గనులు కేటాయించారు. స్టీల్‌ ఉత్పత్తి వ్యయంలో ముడి ఇనుప ఖనిజంపై చేసే ఖర్చు చాలా కీలకమైంది. విశాఖ ఉక్కుకి సొంత ముడి ఇనుప గనులు లేకపోవడం వల్ల ప్రైవేట్‌ వారి నుండి కొనుగోలు చేస్తున్నది. ఈ ఏడాది ఒక టన్ను ముడి ఇనుప ఖనిజాన్ని సగటున సుమారు రూ.8500 కు కొనుగోలు చేశారు. టాటా, జిందాల్‌, మిట్టల్‌ తదితర పరిశ్రమలన్నీ సొంత గనులు ఉండటం వల్ల ఒక టన్ను ముడి ఇనుప ఖనిజాన్ని కేవలం రూ. 800కే సమీకరించుకోగలిగాయి. దీనివల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఇతర అన్ని స్టీల్‌ప్లాంట్ల కంటే రూ.2 వేల కోట్లకు పైగా అదనంగా ముడి ఖనిజంపై ఖర్చు భరించాల్సి వస్తున్నది. ఫలితంగా ఉక్కు ఉత్పత్తి వ్యయంలో 56 శాతం విశాఖ స్టీల్‌ ముడి పదార్ధాలకు ఖర్చవుతున్నది. ఇతర స్టీల్‌ప్లాంట్లకైతే ఈ వ్యయం 30 శాతం మాత్రమే ఉంటుంది. మార్కెట్‌లో మాత్రం స్టీల్‌ అంతర్జాతీయ రేట్ల ప్రకారం అన్ని కంపెనీలు ఒకే రేటుకు అమ్మాలి. అయినప్పటికీ ఈ ఏడాది 2022 జనవరి నాటికి రూ.739 కోట్లు నికర లాభం ఆర్జించింది. సొంత ఇనుప గనులు కేటాయిస్తే ఏడాదికి 2 వేల కోట్లకు పైగా లాభాలు ఆర్జిస్తుంది. అబద్ధం 2 : విశాఖ ఉక్కుకు భారీగా నష్టాలు, రుణ భారం గత ఏడేళ్ళలో విశాఖ ఉక్కు రూ.7122 కోట్లు నష్టాలు చవి చూసిందని, రుణ భారం కూడా రూ. 22 వేల కోట్లు ఉందని మంత్రి వాపోయారు. విశాఖ ఉక్కు 2015-16 నుండి లాభాల్లోనే కొనసాగుతున్నది. ఇది వాస్తవం. అయితే విశాఖ ఉక్కుకు ఇటీవల నికర నష్టాలు ఎందుకు వస్తున్నాయంటే మొదటిది దీనికి సొంత ఇనుప గనులు లేకపోవటం. ముడి ఇనుప ఖనిజం ధర ఈ ఆరేళ్లలో నాలుగు రెట్లు పెరిగింది. రెండోది ప్లాంట్‌ 33 లక్షల టన్నుల నుండి 73 లక్షల టన్నులకు విస్తరించింది. రాయబరేలిలో 500 కోట్లతో రైలు చక్రాల తయారి పరిశ్రమను నిర్మించింది. వీటి కోసం ప్లాంట్‌కి ఉన్న మిగులు నిధులతో పాటు బ్యాంకుల నుండి అప్పులు తీసుకుని విస్తరణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఈ విస్తరణకు ఒక్క రూపాయి పెట్టుబడి ఇవ్వలేదు. అందువల్ల రూ. 22 వేల కోట్ల అప్పు చేయాల్సి వచ్చింది. పైపెచ్చు అప్పుపై 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తున్నది. ప్రైవేట్‌ స్టీల్‌ కంపెనీలకు బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్లు విశాఖ స్టీల్‌ కి కూడా కేంద్ర ప్రభుత్వం వర్తింప చేస్తే ఏడాదికి కనీసం రూ.700 కోట్లు వడ్డీ ఆదా అవుతుంది. ఈ విస్తరణ ద్వారా సుమారు పది వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. దేశంలో ఏ ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్‌కి అప్పులు లేవు? అంతే కాదు దేశంలో ఉన్న 8 బడా స్టీల్‌ కంపెనీలు సుమారు రూ. 2 లక్షల 15 వేల కోట్లు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టాయి. కేంద్ర బిజెపి ప్రభుత్వం మద్దతుతోనే రుణాల రద్దు జరిగాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏ బ్యాంకుకు ఒక్క రూపాయి ఎగ్గొట్టలేదు. నికర నష్టాలున్నా గత ఏడేళ్ళలో సుమారు 16 వేల కోట్లు కేంద్రానికి పన్నులు చెల్లించింది.
అబద్ధం 3 : విశాఖ ఉక్కు ఉత్పాదకత, ఉత్పత్తి తగ్గింది. రెండేళ్ల నుండి జీతాలు ఇవ్వలేని స్థితి గత రెండేళ్లు కోవిడ్‌ సంక్షోభం కొనసాగినప్పటికీ విశాఖ ఉక్కు తన ఉత్పత్తిని 60 లక్షల టన్నులకు పైగా చేయగలిగింది. అంతేగాక గత ఆరేళ్లలో టర్నోవర్‌ రూ.12 వేల కోట్ల నుండి రూ.24 వేల కోట్లకు పెంచుకోగలిగింది. ఉత్పాదకత బాగా ఉందని, 88 శాతం ఉత్పత్తి సామర్ధ్యాన్ని వినియోగించు కుంటున్నదని సాక్షాత్తూ స్టీల్‌ పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ తన నివేదిక లోనే పేర్కొన్నది. వాస్తవంగా ఈ ప్లాంటు ఉత్పత్తి సామర్థ్యం 2025 నాటికి 120 లక్షల టన్నులకు పెంచుకోవాలి. కానీ కేంద్ర బిజెపి నుండి ఆర్థిక సహకారం లేకపోవడంతో ఈ విస్తరణకు నోచుకోలేక పోయింది. అలా జరిగి ఉన్నట్లయితే మరో 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించబడేవి. కోవిడ్‌ కాలంలో దేశంలోని అన్ని ప్రయివేటు స్టీలు పరిశ్రమలు కార్మికులను తొలిగించటం, జీతాల్లో కోత పెట్టడం చేశాయి. కానీ విశాఖ ఉక్కులో మాత్రం ఈ దారుణం జరగలేదు. అంతేకాదు ఏడాదికి రూ.2588 కోట్లు జీతాలకే చెల్లిస్తున్నది.
అబద్ధం 4 : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగినా ఇలాగే ఉంటుంది! ఉద్యోగాలు పెరుగుతాయి!! ప్రైవేటీకరణ జరిగితే ప్లాంట్‌ ఎక్కడికి పోదు. అక్కడే ఉంటుందని పార్లమెంట్‌లో ఉక్కు మంత్రి వ్యంగ్యంగా చెప్పారు. విశాఖ స్టీలు ప్రైవేటీకరణ జరిగితే ఏమౌతుంది? తొలుత దీని విస్తరణకు ఉన్న ఏడు వేల ఎకరాల భూమిని రియల్‌ ఎస్టేట్‌ పేర అమ్మేస్తారు. ఉద్యోగులంద రినీ వి.ఆర్‌.ఎస్‌ కింద తొలగిస్తారు. జీతాల్లో భారీగా కోతలు పెడతారు. కాంట్రాక్టు కార్మికులను సైతం తొలగిస్తారు. ఏ ఒక్కరికి ఉద్యోగ భద్రత ఉండదు. కార్మిక హక్కులు అమలు ఉండదు. ఈ చర్యలు మొత్తం విశాఖ నగర ప్రజల ఆర్థిక జీవనాన్ని దెబ్బతీస్తుంది. ఎయిర్‌ ఇండ ియాని, నీలాచల్‌ స్టీల్‌ ని టాటా కొన్నతరువాత జరిగిందేంటి? కార్మికులను కేవలం ఏడాది మాత్రమే కొనసాగిస్తాం, ఆ తరువాత వి.ఆర్‌.ఎస్‌ ద్వారా అందరినీ తొలగిస్తాం అని ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేస్తే ఇదే జరుగుతుంది.
అబద్ధం 5 : ఉక్కు నిర్వాసితులకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేశాం !విశాఖ స్టీల్‌ కోసం 16,500 కుటుంబాలు 22 వేల ఎకరాల భూమిని త్యాగం చేశారు, 64 గ్రామాలు తొలగించబడ్డాయి. ఇప్పటివరకు ఇచ్చిన శాశ్వత ఉద్యోగాలు 8 వేలు మాత్రమే. ఇంకా సగం మందికి పైగా ఇవ్వాల్సి ఉంది. ఐదు వేల ఉద్యోగాలకే ఒప్పందం జరిగిందని ఇక ఎవరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరమే లేదని మంత్రి తెగేసి చెప్పారు. నిర్వాసితుల ఉద్యోగాల కోసం అనేక పోరాటాలు జరిగాయి. కాలక్రమంలో నిర్వాసితులందరికి ఉద్యోగాల కల్పనకు అనేక ఒప్పందాలు, హామీలు జరిగాయి. ఈ వాస్తవాలను మంత్రి కప్పిపుచ్చారు. ఇటీవల ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌ను కూడా బిజెపి దుర్మార్గంగా రద్దు చేయించింది. ఉక్కు ఉద్యమాన్ని చీల్చడానికి, నీరుగార్చడానికి బిజెపి అనేక కుట్రలకు పాల్పడింది. నిర్వాసితులపై వల పన్నింది. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని, మేలు చేస్తామని నమ్మబలికింది. బిజెపి అగ్ర నాయకత్వం విశాఖలో వుండి కొందరిని తనవైపు తిప్పుకోవడానికి కూడా ప్రయత్నం చేసింది. అయినా ఉద్యమంలో చీలిక తీసుకు రాలేకపోయింది. చివరికి ఇప్పుడు నిర్వాసితుల పట్ల బిజెపి తన అసలు నైజాన్ని పార్లమెంట్‌లో బయటపెట్టింది. నిర్వాసితులకు అన్నీ ఇచ్చేశాం. ప్లాంట్‌ కు నిర్వాసితులకు ఎటువంటి సంబంధం లేదనే విధంగా దుర్మార్గంగా తెగేసి చెప్పింది.
అబద్ధం 6 : నీలాచల్‌ స్టీల్‌ ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగుల జీతాలు రెట్టింపు అయ్యాయివాస్తవం ఏమిటంటే ఈ కంపెనీని టాటాకి గత నెల బిజెపి అమ్మేసింది. ఈ అమ్మకంలో నీలాచల్‌ కంపెనీ ఉద్యోగులను కేవలం ఏడాది మాత్రమే కొనసాగించటానికి, తరువాత వి.ఆర్‌.ఎస్‌ తో వీరిని తొలగించటానికి టాటాతో బిజెపి ఒప్పందం చేసుకుంది. అంటే త్వరలో పర్మినెంట్‌ ఉద్యోగులందరినీ తొలగించటం ఖాయం. ఈ నిజాన్ని దాచిపెట్టి ఉద్యోగులకు జీతాలు రెట్టింపయ్యాయనడం ప్రజలను మోసగించడమే. పైగా, మోడీ అధికారం చేపట్టిన తరువాత పూర్తిగా ప్రభుత్వ కంపెనీలను అమ్మేసిన దానిలో నీలాచల్‌ స్టీల్‌ రెండోది. గత ఏడాది లక్షల కోట్ల విలువ చేసే ఎయిర్‌ ఇండియాను 18 వేల కోట్లకు టాటా కి అమ్మేశారు. నీలాచల్‌ స్టీల్‌ ఆస్తుల విలువను కేంద్ర ప్రభుత్వం రూ.5616 కోట్లుగా నిర్ధారించి దీనిని రిజర్వు ధరగా ప్రకటించింది. టాటా స్టీల్‌ దీనిని ఏకంగా రూ.12,011 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదెలా సాధ్యమైంది? ఈ కంపెనీకి వందేళ్ళకు సరిపడా 874 హెక్టార్లలో సుమారు 102 మిలియన్‌ టన్నుల ముడి ఇనుప గనులు ఉన్నాయి. ప్రస్తుత రేటు ప్రకారం ఈ గనులు అమ్ముకుంటే సుమారు రూ.80 వేల కోట్లు ఆదాయం వస్తుంది. అంతేగాక ఈ ప్లాంట్‌ 100 లక్షల టన్నుల తక్షణ విస్తరణకు అన్ని అవకాశాలున్నాయి. 2500 ఎకరాల మిగుల భూమి ఉంది. పారదీప్‌ పోర్టుకి దగ్గరలో ఉంది. మోడీ ప్రభుత్వం అందుకే టాటా స్టీల్‌కి కట్టబెట్టింది. విశాఖ ఉక్కులో దీనిని కలిపివేయాలని డిమాండ్‌ చేసినా బిజెపి అంగీకరించలేదు. అసలు కుట్ర ఏమిటి ?దేశంలోని ప్రభుత్వ స్టీల్‌ కంపెనీలన్నింటిని బడా కార్పోరేట్ల పరం చేయాలన్నదే బిజెపి కుట్ర. వామపక్షాలు మినహా దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ విధానాలను బలపరుస్తున్నాయనేది వాస్తవం. 90వ దశకంలో మొత్తం దేశీయ స్టీల్‌ ఉత్పత్తిలో ప్రభుత్వ స్టీల్‌ కంపెనీల వాటా 46 శాతం ఉండేది. నేడు 17 శాతానికి పడిపోయింది. గత 3 దశాబ్దాల ప్రైవేటీకరణ విధానాల వలన టాటా, మిట్టల్‌, జిందాల్‌ వంటి 6 బడా కంపెనీలు స్టీల్‌రంగంలో అతి పెద్ద కంపెనీలుగా అవతరించాయి. నేడు స్టీల్‌ ఉత్పత్తిలో వీటి వాటా 46 శాతానికి చేరింది. ఇప్పుడు ప్రభుత్వ స్టీల్‌ పరిశ్రమల న్నిటినీ తమ సొంతం చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అలాగే మొత్తం స్టీల్‌ ఉత్పత్తిలో నేడు చిన్నతరహా స్టీల్‌ కంపెనీల మొత్తం కంపెనీల వాటా 42 శాతం ఉంది. వీటిని కూడా ఈ బడా కంపెనీలు మింగేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందుకు బిజెపి అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నది. ఫలితంగా జరగబోయే పరిణామం ఏంటంటే మొత్తం దేశీయ స్టీల్‌ రంగం కేవలం నాలుగైదు బడా కంపెనీల గుత్తాధిపత్తం లోకి వెళ్ళబోతున్నది. /వ్యాసకర్త: గౌరవాధ్యక్షులు, స్టీల్‌ప్లాంట్‌ గుర్తింపు యూనియన్‌ (సిఐటియు) / డా|| బి.గంగారావు