ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లు .. సుప్రీం తీర్పు - పర్యవసానాలు

సామాజిక, విద్యా విషయక, సాంస్కృతిక, ఆర్థిక వెనకబాటుతనాలను అవినాభావ సంబంధంగల అంశాలుగా పరిగణించాలి. అవి పరస్పరం ప్రభావం జేయగల, ప్రభావితం కాగల అంశాలు. అందువలన రిజర్వేషన్లను నిర్ణయించేటప్పుడు, అమలు చేసేటపుడు, అఫర్మేటివ్‌ యాక్షన్‌ కార్యక్రమాలను తీసుకునేప్పుడు ఆర్థిక అంశాన్ని విస్మరించడం ఆయా తరగతులలో నిజమైన అర్హులకు అన్యాయం చేస్తుంది. మన దేశంలో సామాజిక ఆర్థిక అణచివేతకు మూలంగా కుల వ్యవస్థ ఉన్నందున సామాజిక అంశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానర్ధం ఇతర అంశాలకు ముఖ్యంగా ఆర్థిక అంశాన్ని విస్మరించమని కాదు. అలా విస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది.
ర్థికంగా వెనకబడిన తరగతులకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించిన 103వ రాజ్యాంగ సవరణ చట్ట బద్ధమేనని అయిదుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. రాజ్యాంగ సవరణను సమర్ధిస్తూ ముగ్గురు, వ్యతిరేకిస్తూ ఇద్దరు న్యాయమూర్తులు విభజన తీర్పు చెప్పడంతో చర్చనీయాంశమైంది. రిజర్వేషన్ల నిర్ణయానికి ఆర్థిక కొలబద్దను వినియోగించడం న్యాయ సమ్మతమేనన్న విషయంలో న్యాయమూర్తులందరూ ఏకీభావం వ్యక్తంజేశారు. కానీ ఇద్దరు న్యాయమూర్తులు ఇతర అంశాల ప్రాతిపదికన రాజ్యాంగ సవరణ న్యాయబద్ధతను తిరస్కరించారు.
సుప్రీంకోర్టు తీర్పు ఒక వివాదాన్ని పరిష్కరిస్తూ మరికొన్ని వివాదాలకు తెర లేపుతున్నదని తన ఆందోళనను వ్యక్తంజేస్తూనే ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లను సమర్ధిస్తూ ఇచ్చిన తీర్పును భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆహ్వానించింది. ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కొంత శాతం రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ విషయాలలో ఇవ్వాలని సిపిఐ(ఎం) చాలాకాలం నుండి చెప్తున్నది. బీహార్‌లో కర్పూరీ ఠాకూర్‌ ప్రభుత్వం 1978లో ఆర్థికంగా వెనకబడిన తరగతులకు 6శాతం రిజర్వేషన్లు కల్పించినపుడు సిపిఐ(ఎం) సమర్ధించింది. అదే వైఖరికి అనుగుణంగా పార్లమెంటులో 103వ రాజ్యాంగ సవరణను సమర్ధించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పును కూడా ఆహ్వానించింది.
       సిపిఐ(ఎం) మూడు అంశాల ప్రాతిపదికగా ఇ.డబ్య్లు.ఎస్‌ రిజర్వేషన్లను సమర్ధిస్తున్నది. మొదటిది, సామాజిక, విద్యా విషయక, సాంస్కృతిక, ఆర్థిక వెనకబాటుతనాలను అవినాభావ సంబంధంగల అంశాలుగా పరిగణించాలి. అవి పరస్పరం ప్రభావం జేయగల, ప్రభావితం కాగల అంశాలు. అందువలన రిజర్వేషన్లను నిర్ణయించేటప్పుడు, అమలు చేసేటపుడు, అఫర్మేటివ్‌ యాక్షన్‌ కార్యక్రమాలను తీసుకునేప్పుడు ఆర్థిక అంశాన్ని విస్మరించడం ఆయా తరగతులలో నిజమైన అర్హులకు అన్యాయం చేస్తుంది. మన దేశంలో సామాజిక ఆర్థిక అణచివేతకు మూలంగా కుల వ్యవస్థ ఉన్నందున సామాజిక అంశానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. దానర్ధం ఇతర అంశాలకు ముఖ్యంగా ఆర్థిక అంశాన్ని విస్మరించమని కాదు. అలా విస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది.
          రెండవది, రిజర్వేషన్ల పరిధిలోకి రాని తరగతులలో అత్యధికులు ఆర్థికంగా వెనకబడినవారున్నారు. పెట్టుబడిదారీ విధానం దేశంలో విస్తరించేకొలదీ వీరి సంఖ్య పెరుగుతున్నది. వారి పరిస్థితి దుర్భరం అవుతున్నది. ఈ తరగతులలోని యువకులకు విద్యా ఉద్యోగాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. తమ దుస్థితికి ఇతరులకు రిజర్వేషన్లు ఉండడం, లేక తమకు లేకపోవడమేనన్న అపోహలకు గురవుతున్నారు. పాలక వర్గాలు, వారి మీడియా ఈ అపోహలను పెంచు తున్నాయి. పర్యవసానంగా రిజర్వేషన్‌ వ్యతిరేక భావనలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయి. ఈ మానసిక స్థితి రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమాల ద్వారా గతంలో వెల్లడవడం చూశాము. మండల్‌ కమిషన్‌ సిఫార్సుల అమలుకు పూనుకున్నపుడు, రిజర్వేషన్లు లేని తరగతుల లోని పేద, మధ్యతరగతి ప్రజలను రెచ్చగొట్టి పాలకవర్గాలు రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమాన్ని ఉసిగొల్పాయి. రిజర్వేషన్లను తొలగించాలనే స్వార్థపర శక్తులకు (వెస్టెడ్‌ ఇంటరెస్ట్స్‌కు) అవకాశం లేకుండా ఆర్థికంగా వెనకబడిన తరగతులలో రిజర్వేషన్‌ విధానానికి సానుకూలత సాధించాలంటే వారికి కూడా కొంత రిజర్వేషన్‌ కల్పించడం అవసరం. లేనియెడల రిజర్వేషన్లకే ప్రమాదం వస్తుంది.
        మూడవది, సమసమాజ సాధనలో పీడిత వర్గాల ఐక్యత కు ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్మికులు, ఉద్యోగుల్లో రిజర్వే షన్‌ అంశం విభేదాలను, విభజనను సృష్టిస్తున్న సందర్భంలో దాన్ని అధిగమించి వర్గ ఐక్యతను సాధించాలంటే ప్రస్తుత రిజర్వేషన్‌ పరిధిలోకి రాని తరగతులకు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా సామాజిక విభజన వలన ఏర్పడే అనైక్యతను కొంతవరకు నిరోధించే అవకాశం ఉంది.
       విధానపరమైన అంశంతోపాటు, రిజర్వేషన్ల పట్ల సానుకూల వాతావరణం ఏర్పర్చడానికి, వర్గ ఐక్యతను బలపర్చుకోవడానికి ఆర్థికంగా వెనకబడిన తరగతులకు కూడా రిజర్వేషన్లను కల్పించడం అవసరం అన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం.
         కొంతమంది రిజర్వేషన్లకు ఆర్థిక కొలబద్దను ప్రాతిపదికగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగంలో సామాజిక విద్యా విషయక వెనకబాటుతనాన్ని మాత్రమే కొలమానంగా తీసుకోవాలని ఉంది తప్ప ఆర్థిక వెనకబాటుతనం గురించి ప్రస్తావన లేదని, అందువలన ఇ.డబ్ల్యు.ఎస్‌కు రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదని వాదిస్తున్నారు. ఈ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆర్థిక న్యాయాన్ని అందించడం కూడా రాజ్యాంగ లక్ష్యమని, అందులో భాగంగా ఆర్థికంగా వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయమేనని కోర్టు అభిప్రాయపడింది.
           ఇ.డబ్ల్యు.ఎస్‌ తరగతులను ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి చేయవచ్చుగదా, రిజర్వేషన్ల అవసరమేమిటని ఇంకో వాదన ఉంది. ఇప్పుడు రిజర్వేషన్లు అనుభవిస్తున్న సామాజిక తరగతులకు కూడా ఇతర సంక్షేమ కార్యక్రమాలు జమిలిగా అమలవుతున్నాయి. అలా అయినపుడు సామాజిక తరగతుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకుండా ఇ.డబ్లు.ఎస్‌ తరగతులకు రిజర్వేషన్లు అమలుజేయడాన్ని వ్యతిరేకించడంలో ఔచిత్యం కన్పించదు.
           రిజర్వేషన్లనేవి సామాజిక అంశానికి వర్తిస్తాయి తప్ప ఆర్థిక అంశానికి విస్తరించడం అంటే రిజర్వేషన్‌ స్వభావానికే విరుద్ధం అనే వాదన కూడా ఉంది. ఇతర దేశాల అనుభవాలు, మన దేశంలో రిజర్వేషన్లు పరిణామం చెందిన తీరు చూస్తే ఈ వాదన నిలబడదు. రిజర్వేషన్లు ఆయా దేశాల పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి అమలయ్యాయి. మలేషియాలో మెజారిటీ మలే జాతి ఆర్థిక వెనకబాటుతనం రిజర్వేషన్‌కు ప్రాతిపదికగా ఉంది. అమెరికాలో మూలవాసి అమెరికన్ల కోసం కొన్ని ప్రాంతాలను రిజర్వేషన్లుగా ప్రకటించారు. ఇక్కడ ప్రదేశం రిజర్వేషన్‌గా ఉంది. విద్యా ఉద్యోగాలలో మన లాగా కోటా పద్ధతి కాకుండా, న్యాయ వ్యవస్థ ద్వారా అమలు సాధ్యంగాని నిర్ణీత లక్ష్యాల ద్వారా వైవిధ్యాన్ని సాధించే పద్ధతులలో అఫర్మేటివ్‌ యాక్షన్‌ అమలవుతున్నది. ఐర్లండ్‌ రిజర్వేషన్లకు మత ప్రాతిపదిక ఉన్నది.
       మన దేశంలో రిజర్వేషన్‌ విధానం పరిణామం చూసినా, సామాజిక అంశంతోపాటు అనేక ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు విదితమవుతుంది. బ్రిటిష్‌ వలస పాలకులు తమ విభజించు పాలించు విధానంలో భాగంగా 1909లో మత ప్రాతిపదికగా ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్‌ ప్రవేశపెట్టారు. బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల ప్రభావంతో కొన్ని సంస్థానాలలో 20వ శతాబ్దం ప్రారంభంలో (ట్రావన్‌కోర్‌, బరోడా వగైరా) బ్రాహ్మణేతరులకు ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత రిజర్వేషన్లు కల్పించారు. 1921లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో జస్టిస్‌ పార్టీ బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్లు అమలుచేసింది. ఈ రిజర్వేషన్లు ప్రధానంగా జమీందార్లు, భూస్వాములు బలంగా ఉన్న శూద్ర కులాలకు ఉద్దేశించబడ్డాయి. అస్పృస్యతకు గురవుతున్న షెడ్యూల్డ్‌ కులాలకు డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ నిర్విరామ ఆందోళన, కృషి ఫలితంగా మొదటిసారిగా 1935లో ప్రాతినిధ్య సంస్థల్లో రిజర్వేషన్లు వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతగానీ షెడ్యూల్డ్‌ తెగలకు రిజర్వేషన్లు కల్పించబడలేదు. షెడ్యూల్డ్‌ తెగలలో కుల వ్యవస్థ, అస్పృశ్యత లేకపోయినా సాంస్కృతిక, విద్య, ఆర్థిక వెనకబాటు ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించబడ్డాయి. అప్పుడు కూడా వెనకబడిన కులాల అభివృద్ధి విషయం రాష్ట్రాలకు వదిలివేయబడింది. వర్ణ వ్యవస్థ లోని సామాజిక అంశాన్ని పరిగణన లోకి తీసుకుంటే ఈ కులాలన్నీ రిజర్వేషన్లకు అర్హులు. ఈ అంశాన్నిబట్టే అనేక ఆధిపత్య శూద్రకులాలు బి.సి జాబితాలో చేర్చబడి రిజర్వేషన్లు అనుభవిస్తున్నాయి. ఇంకా అనేక కులాలు అటువంటి డిమాండ్‌తో ఆందోళన చేస్తున్నాయి. కానీ వర్ణ వ్యవస్థలో సామాజికంగా అగ్ర వర్ణాలకన్నా దిగువ స్థాయిగా పరిగణించబడే శూద్ర కులాలన్నీ ఒకే మోస్తరుగా వెనకబడి లేవు. వాటిల్లో కొన్ని గ్రామీణ సమాజంలో ఆధిపత్యం వహిస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం ఈ కులాల్లో ధనాఢ్య వర్గాలు అభివృద్ధి అయ్యాయి. ఈ తరగతులలోని నిజమైన అర్హులకు మాత్రమే రిజర్వేషన్‌ ప్రయోజనం అందాలంటే ఆర్థిక కొలబద్దను వినియోగించడం తప్ప మార్గం లేదు. అందుకే బిసి తరగతులకు క్రీమీలేయర్‌ను మినహాయిస్తూ ఆర్థిక పరిమితి విధించబడింది.
       సామాజిక అంశాన్ని రిజర్వేషన్లకు ఏకైక కొలబద్దగా ఉంచాలనేవారు సామాజిక వెనకబాటుతనం అన్ని కులాలకు, తరగతులకు ఏకరూపంగా ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. సామాజిక పీడన అసలైన రూపం అస్పృశ్యత, అంటరానితనం. ఇది దళితులకు మిగతా అందరికీ మధ్య ఉన్న సామాజిక అగాధం. దళితులు ఎదుర్కొంటున్న సామాజిక దుస్థితికి, ఇతరులు ఎదుర్కొనే సామాజిక వెనకబాటుతనానికి పోలిక లేదు. అలాగే సేవాకులాలకు మిగిలిన శూద్ర కులాలకు, ముఖ్యంగా వ్యవసాయ కులాలకు మధ్య ఉండే సామాజిక వ్యత్యాసం అనేక రూపాలలో కొట్టొచ్చినట్లు కనపడుతుంది. చాలా సందర్భాలలో శూద్ర కులాలలోని ఆధిపత్య కులాలు సామాజిక వివక్ష పాటింపులో ముందుంటున్న స్థితి చూస్తున్నాం. అగ్రకులాల్లో సైతం ఉపశాఖల మధ్య సామాజిక తారతమ్యాలు, హోదా వ్యత్యాసాలు ఉంటున్నాయి. అందుకే కుల వ్యవస్థను డాక్టర్‌ అంబేద్కర్‌ నిచ్చెన మెట్లతో పోల్చారు. వైవిధ్య రూపాలలో కొనసాగుతున్న సామాజిక వివక్షపై పోరాడాలంటే అందరికీ ఒకే కొలబద్దలు సరిపోవు.
        దేశంలో ప్రస్తుతం సామాజిక బృందాలపై ఆధారపడిన వర్టికల్‌ రిజర్వేషన్లతో పాటు, ఇతర అంశాలను పరిగణన లోకి తీసుకున్న సమాంతర రిజర్వేషన్లు కూడా అమలవుతున్నాయి. మహిళలు, వికలాంగులు, క్రీడాకారులు, మాజీ సైనికోద్యోగులు, వెనకబడిన ప్రాంతాలు, స్థానికులు- స్థానికేతరులు వగైరా రిజర్వేషన్లు కూడా అమలవుతున్నాయి. రిజర్వేషన్ల వర్తింపునకు సామాజిక అంశంతో పాటు అనేక అంశాలను పరిగణిస్తున్నారన్నది గమనించవచ్చు. అందుకే ఈ సమస్య పట్ల ఒక సమగ్ర దృక్పథం అవసరం.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముందుకు వచ్చిన మరికొన్ని వివాదాలను పరిశీలించాలి. 'ఆర్థిక కొలబద్ద' సమంజసత్వంపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మెజారిటీతో ఏకీభవిస్తూనే, 10 శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ 50 శాతం పరిమితిని దాటుతున్నందున అది న్యాయబద్ధం కాదని ఇద్దరు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఈ అభిప్రాయాన్ని తిరస్కరిస్తూ మెజారిటీ తీర్పు 50 శాతం పరిమితి అనుల్లంఘనీయమైనదేమీ కాదని కొట్టిపారేసింది. ఈ వ్యాఖ్యానం 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు విధించిన పరిమితిని వివాదాస్పదం జేసింది. సిపిఐ(ఎం)తో పాటు అనేక ఇతర శక్తులు 50 శాతం సీలింగును తొలగించాలని, అప్పుడే రిజర్వేషన్లకు అర్హులైన ఇతర తరగతులను ఆ పరిధిలోకి తీసుకురావచ్చని వాదిస్తూ వస్తున్నాయి. తీర్పు ఈ వాదనలను బలపరుస్తున్నది. మండల్‌ కమిషన్‌ సిఫార్సులు అమలయినప్పుడు ఓబిసి రిజర్వేషన్లు 27 శాతంగా నిర్ణయించడానికి 50 శాతం పరిమితి తప్ప వేరే కొలబద్దేమీ లేదు. ఇప్పుడు 50 శాతం పరిమితి అనుల్లంఘనీయం కానప్పుడు ఓబిసిలకు, ఎస్‌సి, ఎస్‌టిల వలే జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఓబిసి జనాభా నిష్పత్తిని నిర్ణయించేందుకు సరైన లెక్కలు ప్రస్తుతం లేవు. ఉజ్జాయింపుగా లెక్క వేయడానికి బ్రిటిష్‌వారు నిర్వహించిన 1931 సెన్సస్‌ వివరాలను వినియోగించుకుంటున్నారు. ఈ సమాచార లేమిని సరిజేసేందుకు అందరూ కోరుతున్నట్లుగా జనగణన సందర్భంగా ఎస్‌సి, ఎస్‌టితో పాటు అన్ని కులాల గణన చేయడం అవసరం. అప్పుడే కొన్ని వివాదాలు సక్రమంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వం ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలి.
        ధర్మాసనం 10 శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ను వర్తింపజేసిన తీరు కూడా వివాదాస్పదం అయింది. ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ ఇప్పటివరకు రిజర్వేషన్‌ అనుభవించని తరగతులకు (నాన్‌ రిజర్వుడ్‌ కేటగిరీకి) మాత్రమే వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. అంటే ఈ పది శాతానికి ఎస్‌సి, ఎస్‌టి, బిసి లోని పేదలను అనర్హులను చేయడం ద్వారా ఇంతకుముందు ఉన్న 50 శాతంలో పోటీపడే అవకాశాన్ని 40 శాతానికి కుదించినట్లయింది. 10 శాతం ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్‌ను జనరల్‌ కేటగిరీగా భావించి దానికి అన్ని తరగతులలోని పేదలను అర్హులుగా చేయడం ద్వారా లోపాన్ని సరిదిద్దాల్సి ఉంది. లేనియెడల ఎస్‌సి, ఎస్‌టి, బిసి పేదలు గతంలో ఉన్న సౌకర్యాన్ని కోల్పోతారు. అంతేకాక ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లు 10 శాతం ఉండాలని ఏ కొలబద్ద ప్రకారం నిర్ణయించారన్న విమర్శకు తావు లేకుండా పోతుంది.
         ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్లకు అర్హత నిర్ణయించేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్థిక పరిమితి, మంచి చెడుల జోలికి సుప్రీంకోర్టు పోలేదు. ప్రభుత్వం నిర్దేశించిన 8 లక్షల రూపాయల ఆదాయం, ఐదెకరాల భూమి, వెయ్యి అడుగుల ఇల్లు, వంద గజాల స్థలం పరిమితి సంపన్నులను కూడా రిజర్వేషన్లకు అర్హులను చేస్తున్నది. నిరుపేదలు మాత్రమే అర్హులయ్యే పద్ధతిలో ఆర్థిక పరిమితిని తిరిగి నిర్ణయించకపోతే ఇ.డబ్ల్యు.ఎస్‌ రిజర్వేషన్ల లక్ష్యం పూర్తిగా దెబ్బతింటుంది.
     ఈ వివాదాస్పద అంశాలన్నింటినీ పరిష్కరించి అమలు చేయకపోతే వివాదాలు అనంతంగా కొనసాగుతూనే ఉంటాయి. ధర్మాసనంలోని ఒక న్యాయమూర్తి జస్టిస్‌ దారువాలా రిజర్వేషన్ల విధానాన్ని సమీక్షించాలన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇటువంటి వాదన కోర్టు బయట అనేకమంది వివిధ సందర్భాలలో గతంనుండి వ్యక్తంచేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత గతంలో బహిరంగంగానే ఈ అంశాన్ని ప్రస్తావించారు. క్రమేణా కొన్ని తరగతులలో, మీడియాలో రిజర్వేషన్‌ వ్యతిరేక ధోరణి ప్రబలుతుందనడానికి ఇదొక నిదర్శనం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మొదటి నాలుగు దశాబ్దాలలో ప్రభుత్వ రంగం విస్తరించి, పాలనా వ్యవస్థ పెరిగింది. దీనిమూలంగా రిజర్వేషన్ల వలన విద్యా, వైద్య, ప్రజా ప్రాతినిధ్య రంగాలలోకి కొన్ని కుటుంబాలు అభివృద్ధి కావడానికి తోడ్పడింది. కానీ అత్యధికులకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. గత నాలుగు దశాబ్దాలలో వచ్చిన విధాన మార్పులతో ఉన్న పరిమిత రిజర్వేషన్‌ సౌకర్యం కూడా నిరుపయోగం అవుతున్నది. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, యాంత్రీకరణ మూలంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో రిజర్వేషన్లు అమలుకు నోచుకోవడంలేదు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడానికి పాలక వర్గాలు, కార్పొరేట్లు సుముఖంగా లేవు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ను ప్రవేశ పెట్టడంతో పాటు, వాటిని విస్తరించి పటిష్టంగా అమలుచేయడం అవసరం. మన దేశంలో రిజర్వేషన్‌ అవసరం తీరిపోయిందని అనుకోవడం తప్పు. పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగినంత కాలం రిజర్వేషన్‌ అవసరం తీరిపోదు. ఈ పరిమిత సదుపాయాన్ని కొనసాగిస్తూనే రిజర్వేషన్లు అవసరం లేని సమసమాజ స్థాపనకు సాగిపోవాలి.