ప్రకాశం జిల్లా యర్రజర్ల కొండ ఐరన్‌ నిక్షేపాలు బిందాల్‌ కంపెనీకి కట్టబెట్టకుండా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనుల క్రింద కేటాయించాలని కోరుతూ..

ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,
విజయవాడ,
 తేది : 27 మార్చి, 2024.
శ్రీయుత కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి గారికి,
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,  
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,
అమరావతి.
విషయం: ప్రకాశం జిల్లా యర్రజర్ల కొండ ఐరన్‌ నిక్షేపాలు బిందాల్‌ కంపెనీకి కట్టబెట్టకుండా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సొంత గనుల క్రింద కేటాయించాలని కోరుతూ..
ఒంగోలు రూరల్‌ మండలం యర్రజర్ల, టంగుటూరు మండలం కొణిజేడు, మర్లపాడు, కందులూరు గ్రామాల పరిధిలో 1307 ఎకరాలు కొండ ప్రాంతంలో ఉన్న (65.85 మిలియన్‌ టన్నుల) లోగ్రేడ్‌ మాగ్నటైట్‌ ఇనుప ఖనిజ నిక్షేపాలను జిందాల్‌ అప్పగించడం సరైందికాదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అవసరమని కోరినప్పటికీ కేటాయించకపోవడం రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కల్గించే చర్య. వెంటనే జిందాల్‌ కేటాయించడాన్ని ఆపి విశాఖ ఉక్కుకు కేటాయించాలని కోరుచున్నాను. ఇక్కడ ఉన్న ఇనుప ఖనిజంలో 30 శాతం ఐరన్‌ ఓర్‌ వుంటుంది. బెనిఫికేషన్‌ ద్వారా ఐరన్‌ కంటెంట్‌ పెంచి స్టీల్‌ తయారీకి వినియోగిస్తారు.
15 సం॥ల క్రితం అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేటు కంపెనీల ద్వారా త్రవ్వకం, ప్రాసెసింగ్‌, అమ్మకం చేపట్టాలని నిర్ణయించినది. గతంలో జింప్లెక్స్‌ కంపెనీకి ఇవ్వాలని నిర్ణయించారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకం. ఇప్పుడు మరలా జిందాల్‌ కంపెనీకి పూర్తిగా కట్టబెట్టాలని నిర్ణయం చేయడం దుర్మార్గం. మరలా 2023 ఫిబ్రవరి 22 వ తేదీన బెనిఫికేషన్‌ కొరకు టెండర్‌ పిలిస్తే జిందాల్‌ స్టీల్‌ కంపెనీ దక్కించుకుంది. యం.యం.డి.ఆర్‌.చట్టం 1956కి భిన్నంగా రాబడిలో 11% యం.డి.సి.కి, 89% జందాల్‌ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసింది. 15 లక్షల టన్నుల ఇనుప ఖనిజాన్ని త్రవ్వే విధంగా టెండర్‌ ఇచ్చారు.
2003 ధరల ప్రకారం ప్రపంచ మార్కెట్లో ఐరన్‌ టన్ను ధర రూ.4,083/` వుంది. 11% వాటా ప్రకారం యుం.డి.సి.కి టన్నుకు రూ.449.13 లు, జిందాల్‌ కంపెనీకి 89% వాటా ప్రకారం రూ. 3,638.97 లు, వస్తుంది. 50 లక్షల టన్నులు త్రవ్వితే యం.డి.సి.కి రూ.224.56 కోట్లు, జిందాల్‌ కంపెనీ రూ.1,816.93 కోట్లు రాబడి వస్తుంది. భారీ లాభాలు జిందాల్‌కు దక్కుతాయి. ఈ చర్య రాష్ట్ర సంపదను అక్రమంగా జిందాల్‌కు అప్పగించడమే అవుతుంది. కావున వెంటనే జిందాల్‌తో ఒప్పందం రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ సంపదను ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టకుండా రాష్ట్ర ప్రజా ప్రయోనాల కోసం విశాఖ ఉక్కుకు కేటాయించాలి. కావున దీనిపై సత్వర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి
--