
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ,
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 29 జూన్, 2024.
పోలవరం నిర్వాసితుల పునరావాసంపై శ్వేతపత్రం ప్రకటించాలి
పోలవరం నిర్వాసితుల పునరావాసంపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అవకతవకలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతోంది. నిర్వాసితులకు పరిహారం చెల్లింపు, పునరావాసం కల్పించడానికి తక్షణ ప్రాధాన్యతనిచ్చి నిధులు కేటాయించాలని దశలతో నిమిత్తం లేకుండా ఒకేసారి ఆర్అండ్ఆర్ త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది.
పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్రప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు నిర్మాణానికి సర్వస్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు పరిహారం, పునరావాసం గురించి ప్రభుత్వాలు ఇప్పటివరకు తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు సమగ్రంగా లేవు. గడచిన పదేళ్లుగా నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండాను పునరావాసం కల్పించకపోవడమేగాక వారు నివసిస్తున్న చోట కనీస అభివృద్ధి లేక త్రిశంకు స్వర్గం మాదిరి నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టు అంచనాల్లో ఒక లక్ష ఆరు వేల కుటుంబాలు నిర్వాసితులవుతారని పేర్కొనగా సామాజిక ఆర్థిక సర్వే పేరిట దాన్ని 96,660 కి కుదించడం దారుణం. ఇప్పటి వరకు మొదటి దశ పేరుతో 20 వేల మందిని గుర్తించి అరాకొర ప్యాకేజీ అమలు చేయగా సిపిఐ(యం), గిరిజన సంఘాలు రాష్ట్రవ్యాపిత ఉద్యమం తరువాత కాంటూరు లెక్కలు మార్చకుండానే మరో 30 వేల కుటుంబాలు చేరుస్తామని గత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ లెక్కలకూ, శ్వేతపత్రం లెక్కలకు పొంతన కుదరడం లేదు. ఈ దశలతో నిమిత్తం లేకుండా ఒకేసారి నిర్వాసితులందరికీ పూర్తిస్థాయి పునరావాసం కల్పించడానికి ప్రథమ ప్రాధాన్యతనివ్వాలి.
నిజానికి ఏళ్లు గడుస్తుంటే జనాభా పెరుగుదల, వయస్సు పెరగడంతో పద్ధెనిమిదేళ్లు దాటినవారి సంఖ్య పెరుగుతుంది. కానీ బాధితుల సంఖ్యను ఇలా తగ్గించడం నిర్వాసితులపట్ల అమానుషత్వమే! 2020-21 వరదల్లో ఊళ్లకు ఊళ్లే గోదాట్లో మునిగిపోయాయి. కాఫర్డ్యాం నిర్మాణం అనంతరం ఎన్ని అడుగుల మేర నీరు నిలిచింది, ఎన్ని ఆవాసాలు మునిగిపోయాయన్నది లెక్క తీయాలి. ఆ ప్రాతిపదికగా ముంపు గ్రామాలను ప్రకటించాల్సివుంటుంది. గతంలో చేసిన కాంటూరు లెక్కలు తప్పని గోదావరి వరద ముంపు తేల్చింది. కాబట్టి ముంపు గ్రామాలను శాస్త్రీయంగా నిర్ణయించడానికి తిరిగి సర్వే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆగస్టు నెలలో గోదావరికి వరదలొచ్చే ప్రమాదమున్నందున పరీవాహక గ్రామాల ప్రజలు ముంపు బారిన పడతారు. వారి భద్రతకు ముందస్తు చర్యలను చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర అక్రమాలు జరిగినట్టు శ్వేతపత్రంలో పేర్కొన్నారు. ఇది జాతీయ ప్రాజెక్టు కనుక డ్యాం నిర్మాణంలో జరిగిన అవకతవకలు, సకాలంలో నిధులివ్వకపోవడం, నిర్వాసితులను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం దాని అధీనంలోని సంస్థలూ బాధ్యత నుండి తప్పించుకోలేవు. కానీ ఈ శ్వేత పత్రంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత గురించి ఒక్క ముక్క కూడా ప్రస్తావించకుండా దాని పాపాలను కాపాడే ప్రయత్నం చేసింది. గత పదేళ్ళలో జరిగిన పోలవరం నిర్మాణంలో ఆలస్యానికి, పొరపాటుకు కేంద్రం బాధ్యత ఎంతో తేల్చాలి. ఎన్హెచ్పిసి, హైదరాబాద్ ఐఐటి వంటి సంస్థలు ప్రస్తావించిన సాంకేతికపరమైన అవకతవకల గురించి వివరించారు. ఇలాంటి అంశాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడానికి, ప్రజాధనం దుర్వినియోగానికీ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ కమిటీ డిమాండ్ చేస్తోంది.
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి