పాలక పార్టీ బిజెపిని నడిపించేది, నియంత్రించేది ఆర్ఎస్ఎస్. దీనితో ప్రభుత్వ సంస్థలలోకి దాని కార్యక్రమం, దాని కార్యకర్తలు ప్రవేశించటానికి మార్గం సుగమం అయింది. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామిక నియమాలకు తూట్లుపొడిచే అర్ధ ఫాసిస్టు భావజాలం, లక్ష్యాలు గల ఒక సంస్థకు దీనితో ఒక అవకాశం వచ్చింది. ప్రభుత్వ ప్రాపకం గల హిందూత్వ సంస్థలు అల్పసంఖ్యాక వర్గ ప్రజల మౌలిక హక్కులకు భంగం కలిగిస్తూ తమ విలువల్ని వారిపై రుద్దే పనిని జంకూగొంకూ లేకుండా చేస్తున్నాయి. ఆ విధంగా సామాజిక, సాంస్కృతిక క్షేత్రాలలోకి నియంతృత్వ ప్రవేశం రోజురోజుకూ పెరుగుతూ ఉన్నది.