రాజధాని గ్రామాల్లో భూ సమీకరణ ఇంకా కొనసాగుతోంది. 95 శాతం మంది భూములివ్వగా ఐదు శాతం మందే వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నదీ తాజా గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. మరో 20 రోజుల్లో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలోనూ సమీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. మొత్తం 37,724 వేల ఎకరాల పట్టా భూమి సమీకరించాలని నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో 31,359 ఎకరాలకే అంగీకార పత్రాలిచ్చారు. అందులోనూ 29,854 ఎకరాలకే హక్కుదారులను నిర్థారించారు. ఇందులో 27,082 ఎకరాలకే ఒప్పంద పత్రాలందాయి. కానీ మంత్రులు మాత్రం ఇప్పటికి మొత్తం భూమికి ఒప్పంద పత్రాలు అందాయని చెబుతున్నారు.